శాయంపేట: పరిహారం ఇప్పించాలని మండలంలోని గట్లకానిపర్తి, సూరంపేట గ్రామ రైతులు ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గట్లకానిపర్తి గ్రామానికి చెందిన ఓ ఫర్టిలైజర్స్ యజమాని.. కావేరి–929 ఆడ, మగ విత్తనాలు ఇచ్చాడని తెలిపారు. ఈ విత్తనాలు ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, క్వింటాకు రూ.12,500 ఉంటుందని తెలిపాడని చెప్పారు. గట్లకానిపర్తి, సూరంపేట గ్రామాలకు చెందిన 25 మంది రైతులు 40 ఎకరాల్లో పంట సాగు చేయగా ఎకరాకు 10 కిలోలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫరిలైజర్ షాపు యజమానిని అడిగితే తనకు సంబంధం లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండని నిర్లక్ష్యంగా సమాదానం చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పించాలని ఎస్సై జక్కుల పరమేష్ను కోరారు. కార్యక్రమంలో రైతులు సమ్మిరెడ్డి, లక్ష్మయ్య, అశోక్, రాజిరెడ్డి, దేవేందర్ రెడ్డి, స్వామి, రవీందర్, ప్రభాకర్, కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


