● వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్
హన్మకొండ అర్బన్ : బక్రీద్ పండుగను శాంతియుతంగా, పరస్పర గౌరవ భావాలతో నిర్వహించుకోవాలని, ఇందుకు ప్రజలు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కోరారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్య శారదతో కలిసి అధికారులు, పీస్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ నగరాల్లో ప్రతీ పండుగను ప్రజలు సామరస్యంతో జరుపుకుంటారని, అదే స్ఫూర్తితో బక్రీద్ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా పరస్పర గౌరవంతో పండుగను జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబానీ ఖుస్రూ పాషా, డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.


