హన్మకొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 7న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో భాగంగా విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. వేలేరు మండలం పీచరలో 132/33 కేవీ సబ్ స్టేషన్, చిల్పూరు మండలం కొండాపూర్, జఫర్గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, జఫర్గడ్ మండలం కేంద్రంలో 132/33కేవీ సబ్ స్టేషన్, చిల్పూరు మండలం లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జఫర్గడ్లో 5 వేల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలివ్వాలని సీఎండీ వరుణ్ రెడ్డికి సూచించారు. జఫర్గడ్ 132/33కేవి సబ్ స్టేషన్కు సంబందించిన భూ కేటాయింపునకు ట్రాన్స్ కో అధికారులు వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలన్నారు. ఈ మేరకు సీఎండీ వరుణ్ రెడ్డి సంబంధిత అధికారులకు సభ, భూ కేటాయింపుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.


