ముంపు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు
నయీంనగర్ : వరంగల్ మహానగరానికి వరద ముంపు నుంచి తప్పించేందుకు శాశ్వత పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, స్నేహశబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. మంగళవారం రాత్రి ‘కుడా’ కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ, సాగునీటి పారుదల, కుడా, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్లు, కమిషనర్ సమావేశమై వరద ముంపునుంచి నగరాన్ని రక్షించేందుకు రూపొందించాల్సిన సమగ్ర ప్రణాళికపై చర్చించారు. నగరంలోకి ప్రధానంగా వరదనీరు ఏయే ప్రాంతాలనుంచి వస్తోంది, ఉన్న నాలాలు, వాటి సామర్థ్యం, చెరువులు, ముంపు కాలనీలు, డ్రెయిన్ డక్ట్లు, ప్రస్తుతం చెరువుల పరిస్థితి, ఆక్రమణలు, నగరంనుంచి వరద నీటిని బయటకు పంపే మార్గాలు, డ్రెయినేజీల విస్తరణ, నిర్మాణ వ్యయం అంశాలపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ నగరం భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా వరద ముంపు నుంచి కాపాడేందుకు శాశ్వత సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. వరద నీరు కాలనీలనుంచి నేరుగా బయటికి వెళ్లే విధంగా ప్రణాళిక ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ అదనపు కలెక్టర్లు వెంకట్రెడ్డి, సంధ్యారాణి, మున్సిపల్, ఇరిగేషన్ ఎస్ఈలు సత్యనారాయణ, రాంప్రసాద్, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు, హనుమకొండ, వరంగల్ ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, సుమ, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, తదితర అధికారులు పాల్గొన్నారు.
అధికారులతో రెండు జిల్లాల కలెక్టర్ల సమావేశం


