ఏపీజీఈఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా
మంగళగిరి టౌన్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ఏపీజీఈఎస్ఎ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వేలాదిమంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా వేతనాలు అందలేదని అన్నారు. దీంతో వారి కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీపై ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల క్రమబద్దీకరణ అంశాన్ని తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చించి సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరారు. క్రమబద్దీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు గ్రాస్ శాలరీ వర్తింపజేస్తే వారి కుటుంబాలకు కొంత ఊరట లభిస్తుందని అన్నారు.
ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి
తెనాలి: పట్టణ రామలింగేశ్వరపేటలోని తోటవారి వీధిలో ప్రత్యేక యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ సహిత మహాసుదర్శన యాగంలో శనివారం సాయంత్రం ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి పాల్గొన్నారు. పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. సినీనటుడు వేమూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన మహాసుదర్శనయాగం ఆరంభించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం సుప్రభాతంతో మొదలై సుదర్శన యాగం, నవగ్రహారాధన, శ్రీవేంకటేశ్వర హోమం, శ్రీలక్ష్మీనారాయణ హోమం, మంగళహారతితో రాత్రి ఏడు గంటలకు ముగిసింది. లోకకళ్యాణార్ధం విజయభాస్కర్ చేపడుతున్న మహాసుదర్శనయాగం మంచి ఫలితాలను ఇస్తుందన్నని తనికెళ్ల భరణి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


