లక్ష్మీపురం: అమెరికాతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న వ్యవసాయ వాణిజ్య ఒప్పందాలు దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా 17వ మహాసభ శనివారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించారు. జొన్నా శివశంకర్, వి.భారతి, ఎం.శివసాంబిరెడ్డి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. తొలుత రైతు సంఘం పతాకాన్ని సీనియర్ నాయకులు ఆళ్ల సాంబరెడ్డి ఆవిష్కరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ అమెరికాకు మనం చేసే ఎగుమతులపై 18 శాతంపైగా పన్నులు విధిస్తూ, అమెరికా నుంచి మన దేశం దిగుమతి చేసుకునే వస్తువులపై మాత్రం పన్నులు పూర్తిగా ఎత్తివేయటం వలన మన రైతుల ఉత్పత్తుల విక్రయాలు నిలిచిపోతాయని, రైతులు దివాళా తీస్తారన్నారు. కంపెనీలకు అనుకూలంగా చట్టాలు సవరించారని తెలిపారు. రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం దివాళా తీయిస్తుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ తాళ్లూరి వెంకటరత్నం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్కుమార్, సీనియర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, రిటైర్డ్ డీఎస్పీ బీరం నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రామకృష్ణ, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ.చిష్టీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు కాజా వెంకటేశ్వరరావు, కొత్త వెంకటశివరావు, ఎం.వెంగళరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, బిక్కి శ్రీనివాసరావు, చింత భాస్కరరావు, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థులకు గాయాలు
యడ్లపాడు: జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై యడ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు గాయపడ్డారు. బాధితుల కథనం మేరకు... కోండ్రుపాడులోని కాటూరి మెడికల్ కళాశాల విద్యార్థులు వైద్యపరమైన సేవలు ప్రజలకు అందించటానికి శనివారం రెండు బస్సులో యడ్లపాడు వచ్చారు. విధులు ముగించుకున్న అనంతరం వారు తిరిగి వెళ్లే క్రమంలో గ్రామంలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నిలిపి ఉన్న బస్సుల్లోకి ఎక్కుతున్నారు. ఇంతలో గుంటూరు వైపు నుంచి వచ్చిన నాలుగు చక్రాల ఆటో బస్సు పక్కనే ఉన్న ఐస్క్రీం బండిని, బస్సు ఎక్కుతున్న విద్యార్థులు ఢీకొట్టింది. ప్రమాదంలో విద్యార్థులు హరీష్, ఎం బాలాజీ, సాల్మాన్, సిద్ధ్దార్థ గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.


