తెనాలిరూరల్: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక 2023 నవంబర్ 7వ తేదీ రాత్రి స్నానం చేస్తుండగా వారి గ్రామానికే చెందిన బడుగు మెతుషెల్ దడిలో నుంచి చూస్తున్నాడు. గమనించిన బాలిక తల్లి కేకలు వేసి తన భర్తతో కలసి పట్టుకునేందుకు ప్రయత్నించగా మెతుషెల్ పరారయ్యాడు. ఇదే విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పి చందోలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ ఎస్.రాజశేఖర్ కేసు నమోదు చేశారు. కేసు తెనాలి పోక్సో కోర్టులో శుక్రవారం విచారణకు రాగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల జైలు శిక్ష అనుభవించాలన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున పోక్సో కోర్టు స్పెషల్ ప్రాసిక్యూటర్ వెలినేని రాఘవయ్య వాదించారు.


