పెదకాకాని: గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి బంగారం, వెండి, నగదు మాయం చేసిన ఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకాని శివాలయం రోడ్డులోని న్యూఇండియన్ పబ్లిక్ స్కూల్ వెనుక బజారులో బత్తుల సుబ్బయ్య కుటుంబం నివశిస్తుంది. వారు రోజూ మాదిరిగానే ఇంటికి తలుపులు వేసి వరండాలో నిద్రించారు. ఆ ఇంటికి వెనుక వైపు ఉన్న కిటికీ గుండా గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులులోనికి ప్రవేశించి, బీరువా తెరచి అందులో ఉన్న 7 గ్రాముల బంగారు వస్తువులు, పిల్లలు దాచుకున్న మట్టి ముంత(కిడ్డీ బ్యాంక్)లో ఉన్న నగదు, సుమారు 200 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించారు. ఈ చోరీలో వరండాలో పడుకున్న వారు ఇంటిలోపలికి రాకుండా ఇంట్లో ఉన్న తలుపునకు లోపల గడియపెట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. ఉదయం నిద్ర లేచి తలుపు తీస్తుండగా ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి చూస్తే వెనుక ఉన్న కిటికీ తొలగించి ఉంది. బీరువా తెరచి వస్తువులు చిందర వందరగా పడి ఉంటడం, కిడ్డీ బ్యాంక్ పగులగొడ్డడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలను సేకరించేందుకు క్లూస్ టీంను రప్పించారు. నిందితులు బంగారు వస్తువులతో కలసి ఉన్న రోల్డ్గోల్డ్ వస్తువులను అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు.
కిటికీ నుంచి ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు


