కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో విద్యుత్ లైన్ లాసెస్ తగ్గింపుతో పాటు రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలను సాధించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడ కార్పొరేట్ కార్యాలయంలో గుంటూరు జిల్లా విద్యుత్ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్ఈ చల్లా రమేష్, ఈఈలు, ఆపరేషన్స్ అధికారులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ పనుల పురోగతి, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, పీఎం సూర్య ఘర్, యూఎల్ఏ, పీఎం–కుసుమ్, ఆర్డీఎస్ఎస్, జీఐఎస్ మాపింగ్, ఎల్టీ నెట్వర్క్ అభివృద్ధి తదితర అంశాలపై సీఎండీ సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. లైన్ లాసెస్ తగ్గింపు, రెవెన్యూ వసూళ్లలో సర్కిల్ లక్ష్యాలను తప్పనిసరిగా అందుకోవాలని, ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ ఎ.మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


