గుంటూరు ఎడ్యుకేషన్: స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ (సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు, సన్ వ్యవస్ధాపకుడు కె.యశ్వంత్ తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న శిక్షణ తరగతుల్లో 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు హాజరు కావచ్చునని తెలిపారు. ఐఏఎస్, సివిల్ సర్వీస్ పరీక్షలపై విద్యార్థి స్థాయి నుంచి అవగాహన కల్పించడం లక్ష్యంగా పరీక్షల విధానం, సన్నద్ధత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కె.యశ్వంత్ మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు 94913 36996, 79895 70755, 93469 84938 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ మణిదీప్, సన్ వలంటీర్లు పాల్గొన్నారు.


