వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా
తెనాలి: మంగళగిరి మండలం చినకాకాని పరిధిలోని 71.75 ఎకరాల అంజుమన్–ఏ–ఇస్లామియా భూమిని ప్రభుత్వం లాక్కుంటే నిరవధిక దీక్షకై నా వెనుకాడేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి, గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా స్పష్టంచేశారు. గుంటూరులోని అంజుమన్–ఏ–ఇస్లామ్కు దాదాపు వందేళ్ల క్రితం ఇచ్చిన భూమిని ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుకు కేటాయించటాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ముస్లిం మైనారిటీల ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా షేక్ నూరి ఫాతిమా గుంటూరు నగర ప్రజల నుండి భారీస్థాయిలో సంతకాలను సేకరించి జిల్లాకలెక్టర్కు సమర్పించారు. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై అభ్యంతరాలను తెలియజేయాలంటూ తెనాలి ఇన్చార్జి సబ్కలెక్టర్ నోటీసు జారీచేయటంతో మంగళవారం సాయంత్రం సబ్కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం అందజేశారు. ఇన్చార్జి సబ్కలెక్టర్ కె.లక్ష్మీకుమారి మాట్లాడుతూ ఈ అంశం తన పరిధిలోనిది కాదనీ, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. నూరి ఫాతిమా విలేకరులతో మాట్లాడుతూ, భూసేకరణ ప్రకటన జారీచేసి ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పేదలు, మైనారిటీల సంక్షేమం కోసం అంజుమనె ఏ ఇస్లామ్ కమిటికి భూకేటాయింపు జరిగిందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్, అంజుమన్ జేఏసీ గుంటూరు కన్వీనర్ హఫీజ్ షేక్ మహమ్మద్ రిజ్వానా, కో–కన్వీనర్లు ఎండీఅబ్దుల్ కలాం, షేక్ అయూబ్జానీ, ఖాజావలి, లాహేత్, గౌస్ బాషా, కాలేషా, సయ్యద్ బాబు, షాబా హుస్సేన్, లియాకత్ అలీ, షేక్ అప్సారి, సయ్యద్ బాబు, షేక్ సైదా, షేక్ మస్తాన్వలి, మహమ్మద్ రిజ్వానా, షేక్ దుబాయ్ బాబు, సుభాని పాల్గొన్నారు.


