ఏఎన్యూ దూరవిద్యలో నూతన డిప్లమో కోర్సులు
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నూతనంగా ఐదు డిప్లమో కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు సీడీఈ డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఏఎన్యూలో గురువారం ఆయన మాట్లాడుతూ అమెరికా కేంద్రంగా ఉన్న కనెక్ట్ కన్సల్టెంట్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. సంబంధిత పత్రాలపై వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, కంపెనీ సీఈవో ఎం. సుకుమార్ సంతకాలు చేశారు. డిప్లమో ఇన్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డిప్లమో ఇన్ డేటా ఇంజినీరింగ్, డిప్లమా ఇన్ ఏఐ ఇంజినీరింగ్, డిప్లమో ఇన్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిప్లమో ఇన్ క్లౌడ్ అండ్ డెవలప్మెంట్ ఆపరేషన్ ఇంజినీరింగ్ కోర్సులను కొత్తగా ప్రకటించారు. సంవత్సరం కాల వ్యవధిలో వీటిని పూర్తి చేయవచ్చన్నారు. ప్రవేశానికి ఏదైనా డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియెట్లో గణితశాస్త్రం చదివి ఉండాలని స్పష్టం చేశారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.


