నిమ్మ రైతులకు తప్పని కన్నీరు
తెనాలి: దేశంలో నిమ్మకాయల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో గూడూరు, ఏలూరు మార్కెట్ల తర్వాత నిమ్మకాయలకు ప్రసిద్ధి తెనాలి మార్కెట్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు వేల ఎకరాలకుపైగా నిమ్మతోటలు సాగులో ఉంటే అందులో అత్యధికం తెనాలి డివిజనులోనే ఉన్నాయి. తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని నిమ్మ మార్కెట్లో ప్రతిరోజూ లావాదేవీలు జరుగుతుంటాయి. ఇక్కడి నుంచి ఉత్తర భారతదేశంలోని కాశీ, కోల్కతా, ఢిల్లీ, కాన్పూర్లకు ఎగుమతి చేస్తున్నారు. నిత్యం సీజనులో 12–15 లారీలు, అన్ సీజన్లో 4–5 లారీల సరుకు ఎగుమతి అవుతుంటుంది.
నిమ్మతోటలు ఏటా జూలై, డిసెంబరు, మే నెలలో మూడు కాపులనిస్తాయి. ఒక్కో కాపు మూడేసి నెలలు దిగుబడి ఇస్తుంటుంది. ప్రతి కాపునకు సుమారు 150–200 టిక్కీల వరకు కాయ వస్తుంది. కాయ సైజు ఆధారంగా ఒక్కో టిక్కీకి 45–55 కిలోలు వస్తా యి. కొన్నేళ్లుగా నిమ్మతోటల రైతులకు నికరమైన ఆదాయం వస్తున్నందున కౌలు ధరలు పెరిగాయి. ఎకరా కౌలు రూ.90వేల నుంచి రూ.1.20 లక్షల వరకు చేరిన సందర్భాలున్నాయి. ఎరువులు, పురుగు మందులు, నీటి తడులకు కలిపి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాలి. అయినా సరే, లాభాలు వస్తున్నందున మెట్ట సాగుకు పరిమితమైన నిమ్మ తోటలను డెల్టా రైతులు కొందరు, మాగాణి భూముల్లోనూ పెంచసాగారు.
లాభదాయకమైన నిమ్మతోటల సాగు 2017, 2018 సంవత్సరాల్లో రైతులకు చేదు అనుభవాలను మిగిల్చింది. 2017 ఏప్రిల్లో కిలో రూ.20–30 మధ్య పలికిన ధర, మరో నెలకు రూ.12–20కి దిగజారింది. జూన్లో మరింతగా పతనమై రూ.5–10లకు పడిపోయింది. జూలైలో రూ.7లకు మించలేదు. మళ్లీ 2018లోనూ అదే పరిస్థితి ఎదురైంది. కిలో రూ. 3–7లకు మించటం లేదని రైతులు వాపోయాన్నారు. కోత కూలీ కూడా దక్కదన్న భావనతో కాపు కోయకుండా వదిలేశారు. ఖర్చులు లెక్కేసుకుంటే ఒక్కో నిమ్మకాయకు రైతుకు మిగిలేది 10 పైసలు.
కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అమ్మకాలకు బ్రేక్ పడింది. తర్వాత కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు లేకుండా పోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ చొరవ తీసుకుని వారానికి మూడు రోజులు కొనుగోళ్లు చేసి ఆదుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో కేవలం నెల రోజుల్లో 850 టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేసి ఎగుమతి చేసింది. తర్వాత లారీల సమ్మె రోజుల్లోనూ నిమ్మ రైతులు ఇబ్బందులు పడ్డారు. తర్వాత నుంచి నిలకడగా మంచి ధర రావటం ఆరంభించింది.
2023–24 సంవత్సరం నిమ్మ సాగు రైతులకు సంతృప్తినిచ్చింది. తెనాలి నిమ్మ మార్కెట్లో కిలో రూ.50–70 మధ్య అమ్మకాలు జరిగాయి. ఆ ఏడాది ఏప్రిల్లో కనిష్ట ధర రూ.68, గరిష్టంగా రూ.80, రూ.90 వరకు కొనుగోళ్లు జరిగాయి. ఏప్రిల్ 24న కిలో రూ.90కు విక్రయించారు. ఏప్రిల్ 28వ తేదీ నుంచి కిలో రూ.65పైనే మార్కెట్ లావాదేవీలు కొనసాగుతూ వచ్చాయి. మే ఒకటో తేదీన గరిష్ఠ ధర రూ.78 పలికింది. ఫుల్ జోష్లో ఉన్న రైతులకు, సీజను ముగింపు దశలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ధరల్లో తగ్గుదల కొంత నిరాశపరిచింది.
ప్రస్తుతం భారీగా పతనం...
కొంతమేర ధరలు తగ్గినా నిలకడగా ఉంటున్నందున రైతులు ఇబ్బందులు పడలేదు. ప్రస్తుతం డిసెంబరు కాపు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. గత నెల రోజులుగా కిలో రూ.6–12 ధర మీదనే మార్కెట్ నడుస్తోంది. మంగళవారం రూ.8–12కు ధర పడిపోయింది. సగటు ధర రూ.10. అప్పుడప్పుడు రూ.15కు పలికినా, అది కాయ బాగా నాణ్యంగా ఉంటేనే సుమా. ఒక్కో టిక్కీకి 50 కిలోలనుకుంటే కిలో రూ.10 చొప్పున రైతుకు రూ.500 వస్తాయి. కాయ కోత కూలీ రూ.250, మార్కెట్కు తీసుకొచ్చినందుకు బాడుగ రూ.50, దించుడు కూలీ రూ.20, మార్కెట్లో కమీషన్ రూ.12 చొప్పున ఒక్కో బస్తాకు రూ.332 ఖర్చు తప్పడం లేదు. కిలో రూ.6–8 ధర పడినప్పుడు ఖర్చులు కూడా రావటం లేదని రైతులు చెబుతున్నారు. సోమవారం సగటు ధర రూ.15 పలికింది. నీటి తడుల ఆధారంగా కాపునిచ్చే నిమ్మకు ఈ పర్యాయం వర్షాలు బాగా కలిసొచ్చాయి. దీంతో డిసెంబరులో తోటలన్నీ ఒకేసారి కోతకు వచ్చాయని రైతులు చెబుతున్నారు.
నికర ఆదాయం...
2017–18లో చేదు అనుభవాలు...
కరోనాలో ఆదుకున్న ప్రభుత్వం...
మళ్లీ పెరిగిన ధర...
నిమ్మ రైతులకు మార్కెట్ ధరలు కన్నీరు తెప్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వరకు కిలో రూ.90 వరకు పలికినా, తర్వాత ధరలు తగ్గినప్పటికీ నిలకడగానే ఉంటూ వచ్చాయి. నెల రోజులుగా ధరలు భారీగా పతనం చెందాయి. ఇటీవల వరకు కిలో రూ.6–12 వరకు అమ్మకాలు జరిగాయి. సగటు ధర రూ.10–12 మధ్యనే ఉంటూ వచ్చింది. తాజా రూ.15కు చేరుకుంది. అయినా ఈ ధరలతో నష్టపోక తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చలికాలంలో హఠాత్తుగా తగ్గిన ధర
కాయ ఆధారంగా కిలో రూ. 12–18
సగటున కిలో ధర రూ.12–15
నెల రోజులుగా ఇదే తీరులో అమ్మకాలు
ఖర్చులు కూడా రావని రైతుల గగ్గోలు