రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత
ఏపీ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి
తాడికొండ: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత, వినియోగదారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) నిబద్ధతతో పనిచేస్తుందని ఏపీ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి తెలిపారు. సోమవారం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట నాలుగో బ్లాకులో ఏపీ రెరా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో స్థలాలు, అపార్ట్మెంట్లు లేదా భవనాల అమ్మకం, కొనుగోలు లేదా మార్కెటింగ్ వ్యాపారంలో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా ఏపీ రెరా అధికారిక వెబ్ సైట్ www.rera.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టంపై రియల్ ఎస్టేట్ రంగంలోని స్టేక్ హోల్డర్స్కు విస్తృత స్థాయిలో అవగాహన కోసం ఏపీ రెరా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతినెల ఒక జిల్లాలో 2025 డిసెంబర్ పది నుంచి 13 జిల్లాలలో 2026 డిసెంబర్ వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం తిరుపతి జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఏపీ రెరా డైరెక్టర్ కె.నాగసుందరి మాట్లాడారు. సమావేశంలో ఏపీ రెరా సభ్యులు జగన్నాథ రావు, ఎం.వెంకటరత్నం, డి.శ్రీనివాసరావు, యు.ఎస్.ఎల్.ఎన్.కామేశ్వరరావు, జె.కులదీప్ పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేసి సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆరోగ్య కేంద్రానికి తలుపులు వేసి ఉన్న సందర్భంలో 12 మంది ఉద్యోగులను సస్పెన్షన్ చేసిన విషయంపై సోమవారం ఏపీ ఎన్జీవో నేతలు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ను కలిసి మాట్లాడారు. పనివేళలు ముగిసిన పిదప తనిఖీలకు వచ్చిన నేపథ్యంలో అనాలోచితంగా చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేసి ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. రాత్రిళ్లు విధులు నిర్వహించే స్టాఫ్నర్సులకు తగిన రక్షణ కల్పించాలని, సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు మర్లపాటి రామకృష్ణ, ఇతర నేతలు కమిషనర్ను కలిసిన వారిలో ఉన్నారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ ఆధ్వర్యంలో స్థానిక వీవీవీ హెల్త్ హబ్లో గత రెండు రోజల నుంచి జరుగుతున్న గుంటూరు ఓపెన్ పికిల్ బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి చెందిన టి.నేహా అండర్–14 మిక్సడ్ సింగిల్స్, ఉమెన్ ఓపెన్ సింగిల్స్లో ప్రథమ స్థానాన్ని సాధించి డబుల్ టైటిల్ సాధించింది. ఓపెన్ డబుల్స్లో విన్సెంట్, నాగరాజు విజేతలుగా నిలవగా, పి.ఆనంద్ కుమార్, కె.అరుణ్ కుమార్లు రన్నర్ టైటిల్ను సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాస్టర్ గేమ్స్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ టీవీ రావు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ భాస్కరరావు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టీవీ రావు మాట్లాడుతూ గుంటూరులో పికిల్ బాల్ క్రీడ యువతను బాగా ఆకర్షిస్తుందని తెలిపారు. రోటరీ క్లబ్ తరఫున ఈ పోటీలను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రోటరీ క్లబ్ గుంటూరు ఆదర్శ అధ్యక్షురాలు ఎం.అనురాధ, ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు రోటరీ క్లబ్ సెంటినర్ అధ్యక్షులు డాక్టర్ వీర రాఘవరావు, గుంటూరు ఆదర్శ్ కోశాధికారి జయ శ్రీ, అశోక, జిల్లా పికిల్ బాల్ సంఘం సభ్యులు భరత్, మన్సూర్ వలి, డాక్టర్ హనుమంతరావు, జీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత


