
కౌలు రైతుల సమస్యలు పరిష్కరించండి
కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం
లక్ష్మీపురం: రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి జగన్నాథం అన్నారు. గుంటూరు కొత్తపేటలోని కౌలురైతు సంఘం కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందడంలేదని మండిపడ్డారు. గుర్తింపు కార్డులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మే 6వ తేదీన గుంటూరు మల్లయ్య లింగం భవన్లో ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో కౌలు రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి పాల్గొన్నారు.
పాముకాటుతో మహిళా కూలీ మృతి
బల్లికురవ: పొలంలో కూలీ పనులు చేస్తుండగా పాము కాటు వేయటంతో 30 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఆదివారం సాయంత్రం ఓ మహిళాకూలీ మృతి చెందింది. అందిన సమాచారం ప్రకారం.. బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు పంచాయతీలోని సోమవరప్పాడు గ్రామానికి చెందిన గార్లపాటి మల్లేశ్వరి (52) కూలీనాలీ పనులు చేస్తూ భర్త కోటేశ్వరరావుకు చేదోడుగా నిలుస్తోంది. శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లగా పొలంలో పాము కాటు వేసింది. హుటాహుటిన తోటి కూలీలు వైద్యానికి చిలకలూరిపేటలోని ఓ ప్రవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం చనిపోయింది. మృతురాలికి భర్త, ఒ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే మల్లేశ్వరి.. పాము కాటుకు బలి కావడంతో కుటుంబ సభ్యులు, తోటి కూలీల్లో విషాదఛాయలు అలముకున్నాయి.