
కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించిన ప్రజలు
మంగళగిరి: కూటమి ప్రభుత్వం అధికారం కోసం ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ఆ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ అన్నారు. జూన్ 4వ తేదిన జరగనున్న వెన్ను పోటు దినాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆత్మకూరు జాతీయ రహదారి వెంట ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలనే కాక ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని, దీనిని ప్రజలు గుర్తించారని, కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయం 15 ఎకరాలలో ఉందని, కొత్త ఇంటిని కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న చంద్రబాబు ఎన్ని ఎకరాలలో ఇళ్లు కడుతున్నారని ప్రశ్నించారు. చేతిలో మీడియా ఉందని దుష్పచారం చేస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయని గుర్తించుకోవాలని హితవు పలికారు.
ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చాయి
ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చని టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే వెన్నుపోటు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలంతా వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొని తెలియజేయాలని కోరారు. పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరగనున్న వెన్నుపోటు దినోత్సవంలో నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలను చేసిన మోసాల్ని ఎండగట్టడమే వెన్నుపోటు దినోత్సవ లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర ప్రజలంతా మోసపోయారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. సమావేశంలో గుంటూరు తూర్పు, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు బొమ్ము తాతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు పచ్చల రత్నకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్రాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దామర్ల కుబేరస్వామి, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి మల్లవరపు సుధారాణి, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు ఊట్ల పాలశ్రీనివాసరావు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, మంగళగిరి మండల, పట్టణ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, ఆకురాతి రాజేష్, తాడేపల్లి పట్టణ, రూరల్, దుగ్గిరాల మండల అధ్యక్షులు బుర్రముక్క వేణుగోపాలస్వామిరెడ్డి, అమరా నాగయ్య, తాడిబోయిన శివగోపయ్య, పట్టణ అధ్యక్షురాలు సంకె సునీత, నియోజకవర్గ ప్రతినిధి కాశినీడు బాజి గంగాధర్, జిల్లా సెక్రటరీ అహ్మద్ బాజీ సాహిద్, దివ్యాంగుల అధ్యక్షుడు బొక్కా అగస్టీన్, ఎస్టీ అధ్యక్షుడు మేడా వెంకటేశ్వరరావు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ జూన్ 4న జరిగే వెన్నుపోటు దినాన్ని విజయంతం చేయాలి మంగళగిరి నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు