ప్రశాంతంగా మెగా డీఎస్సీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా మెగా డీఎస్సీ పరీక్షలు

Jun 7 2025 1:47 AM | Updated on Jun 7 2025 2:24 PM

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లాలో మెగా డీఎస్సీ– 2025 పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం నరసరావుపేట పరిధిలో ఏర్పాటు చేసిన 5 కేంద్రాలకు తొలిరోజు 3 చోట్ల పరీక్ష నిర్వహించారు. నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాల, ఎంఏఎం ఇంజినీరింగ్‌ కళాశాల, ఏఎం రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రాలలో 460 మంది అభ్యర్థులకు 404 మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఎంఏఎం ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రాన్ని పరిశీలించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ, సిబ్బంది ఉన్నారు.

చివరి దశకు సాగర్‌ క్రస్ట్‌గేట్ల మరమ్మతులు

విజయపురి సౌత్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు రేడియల్‌ క్రస్ట్‌గేట్ల మరమ్మతులు పూర్తి కావచ్చాయి. సాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులు కాగా, 546 అడుగుల వద్ద నుంచి 26 రేడియల్‌ క్రస్ట్‌గేట్లు ఉంటాయి. రెండు, మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి ట్రయల్‌రన్‌కు ప్రాజెక్టు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటివరకు గేట్లకు పట్టిన తుప్పు వదిలించటంతోపాటు క్రాక్‌లు, వెల్డింగ్‌ జాయింట్‌లను గుర్తించి అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. గత ఏడాది వరద నీరు అధికంగా వచ్చి పలు మార్లు ప్రాజెక్టు రేడియల్‌ క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో రబ్బర్‌ సీళ్లు బాగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవి మారుస్తున్నారు. గేట్లకు గ్రీజింగ్‌, ఆయిలింగ్‌ పనులు చేస్తున్నారు. విద్యుత్‌ సరఫరా అయ్యే ప్యానల్‌ బోర్డులు తనిఖీ చేస్తున్నారు. మరమ్మతులు పూర్తి కాగానే రేడియల్‌ క్రస్ట్‌గేట్లకు అధికారులు ట్రయల్‌ రన్‌ చేస్తారు.

జూలై 5న లోక్‌ అదాలత్‌

నరసరావుపేట టౌన్‌: జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.ఆశీర్వాదం పాల్‌ అన్నారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. లోక్‌ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్‌ కేసులు, సివిల్‌ దావాలు, రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని జూలై 5న నిర్వహించే లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు.

వేణుగోపాలస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం

తాడేపల్లి రూరల్‌ : మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మహానాడు 14వ రోడ్డులోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ట్ట మహోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్‌) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమయ్య, బాలకోటయ్య, చిన్నయ్య, విజయ్‌, దొడ్డిపాటి వెంకటేశ్వరరావు, జానీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వేడుకల్లో యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌...

సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ గొల్ల నరసింహయాదవ్‌ పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తాడిబోయిన భాస్కర్‌, భారత యాదవ సంఘం చైర్మన్‌ లాకా వెంగళరావు, యాదవ భక్తులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా  మెగా డీఎస్సీ పరీక్షలు  1
1/1

ప్రశాంతంగా మెగా డీఎస్సీ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement