
రాజధానికి భూములిచ్చేదే లేదు
●
అమరావతి: తరతరాలుగా అనుభవిస్తున్న భూములను రాజధాని నిర్మాణంలో భాగంగా పూలింగ్కు ఇవ్వటానికి తాము అంగీకరించటం లేదని లేమల్లె గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్తోపాటుగా సత్తెనపల్లి ఆర్డీవో, అమరావతి తహసీల్దార్కు ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు. మండల పరిధిలోని కర్లపూడి రెవెన్యూ గ్రామంలో భాగమైన లేమల్లెకు చెందిన సుమారు 100 సర్వే నంబర్లలో ఉన్న 500 ఎకరాలకు చెందిన 170 మంది రైతుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని రైతులు అధికారులకు సమర్పించారు. ఆ వినతి పత్రంలో... తమకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదని వాపోయారు. పూర్తిగా గ్రామీణ జీవితానికి అలవాటు పడి జీవిస్తున్నామని చెప్పారు. తమకున్న కొద్దిపాటి భూమికి మరికొంత కౌలుకు తీసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. పిల్లల చదువు, వివాహాలకు వ్యవసాయం ద్వారా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని వివరించారు. భూములను పూలింగ్కు ఇవ్వటానికి సిద్ధంగా లేమని తెలిపారు. పంటలు పండించుకుని ఉపాధి పొందుతూ జీవనం సాగించటానికి నిర్ణయించుకున్నామని తెలిపారు.
పూలింగ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న
లేమల్లె రైతులు
ఉపాధి కల్పిస్తున్న భూమి
ఇచ్చి ఏం చేయమంటారని నిలదీత
వ్యవసాయం తప్ప వేరే పని
తెలియదంటున్న అన్నదాతలు
ఈ భూమిపైనే పిల్లల భవిష్యత్
ఆధారపడి ఉందని ఆవేదన
రెవెన్యూ ఉన్నతాధికారులకు
వినతి పత్రాలు అందజేత