
అన్నదాతలను దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం
రైతులకు అందిస్తున్న అన్ని రకాల సేవలను తొలగించిన సర్కార్
పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల్లో అడ్డగోలుగా హామీ
అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఊసే ఎత్తని పాలకులు
రైతులకు అందుతున్న అన్ని పథకాలకు గ్రహణం
పెట్టుబడి లేక, గిట్టుబాటు ధర రాక కన్నీరు పెడుతున్న కర్షకులు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పండుగలా వ్యవసాయం
విత్తు నాటే దగ్గర్నుంచి పంట విక్రయం వరకు అన్నివిధాలా వెన్నుదన్ను
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రైతులకు ఇప్పటికే అందుతున్న సేవలను తొలగించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు కోతలు పెడుతూ వస్తోంది. అన్నదాతలకు భరోసా దూరం చేసి సాగు పేరు చెబితేనే భయపడేలా సర్కార్ వ్యవహరిస్తోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను అలంకారప్రాయంగా చేసింది. కియోస్క్ మిషన్లను మూలన పడేసింది. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందజేతలో తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఉచిత పంట బీమాకు ఎసరు పెట్టింది. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని పరిహాసం చేసింది. మళ్లీ పంటలు వేయాలంటే భయపడేలా వ్యవహరిస్తోంది. ఏటా పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తామని చెప్పి సర్వేల పేరుతో కాలయాపన చేస్తోంది.
కూటమి ప్రభుత్వంలో రైతన్నకు చేసిన దగా చెప్పుకుంటూ పోతే అంతే లేకుండా పోతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటి ముంగిటకే సేవలు అందేవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఐదు సంవత్సరాలు వెన్నుదన్నుగా నిలిచారు. రైతు సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసి అన్నదాతకు ఆర్థిక భరోసా ఇచ్చారు. నాడు వ్యవసాయం రైతుకు పండుగలా ఉండేది. నేడు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాగు అంటే రైతులు భయపడేలా చేసింది.
నాడు సంక్షేమం..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగలా చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ముంగిటకే సేవలను తీసుకొచ్చింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 1.59 వేల హెక్టార్లలో వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. వెబ్ల్యాండ్లో సుమారు 1.65 లక్షల మంది రైతులు నమోదయ్యారు. వీరిలో లక్ష మందికిపైగా వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నారు. వీరిలో 40 వేల మందికిపైగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీరి సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.
నేడు సంక్షోభానికి నిదర్శనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రైతు భరోసా కేంద్రాల్లో యూరియా, డీఏపీ నిల్వలు శూన్యం. పంటల బీమా లేదు.. పరిహారం అందలేదు. మళ్లీ పంటలు వేయాలంటే రైతులు జంకుతున్నారు. పెట్టుబడి పెట్టే స్థోమత లేక కొందరు అప్పులు చేస్తున్నారు. మరికొందరు బీడు భూములుగా వదిలేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభం అయినా అన్నదాత సుఖీభవ ఇవ్వక
పోవడంతో రైతులకు పుట్టెడు దుఃఖమే మిగిల్చింది. రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. ఏడాదైనా ఆ ఊసే పట్టనట్లు వ్యవహరించడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సాయంగా అందించలేదు. గతంలో వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు సర్కారు మరోసారి అదే తీరుగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరు