
నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి, బంగారు తాపడం పనులకు విజయవాడకు చెందిన భక్తులు శనివారం రూ. 2.52 లక్షల విరాళాన్ని అందజేశారు. నగరంలోని రామచంద్రనగర్కు చెందిన బట్టు నాగేశ్వరరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. నాగేశ్వరరావు పేరిట రూ. 1,51,116 విరాళాన్ని, జిష్ణురావు పేరిట బంగారు తాపడం పనులకు రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
నేడు ఏపీసీబీఈఏ
రాష్ట్ర మహాసభలు
చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీసీబీఈఏ) పదో రాష్ట్ర మహాసభలు మచిలీపట్నంలో ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గోపీనాథ్ శనివారం తెలిపారు. జిల్లా కోర్టు సెంటర్లోని రెవెన్యూ కల్యాణ మండపంలో మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. మహాసభలకు 13 జిల్లాల డీసీసీబీ ఉద్యోగులు హాజరుకానున్నారని తెలిపారు. సమావేశానికి జిల్లాలోని సహకార బ్యాంకుల ఉద్యోగులు తప్పని సరిగా హాజరుకావాలని ఆయన కోరారు.
వైభవంగా శోభాయాత్ర
విజయవాడ కల్చరల్: వేంకటేశ్వరుడి శోభాయాత్ర వైభవంగా జరిగింది. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండప ప్రాంగణంలోని పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దేవాలయంలో నిర్వహించిన వైదిక కార్యక్రమాలు భక్తిగా సాగాయి. ఉదయం వేంకటేశ్వర స్వామికి దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వివిధ రకాల పూలతో అలంకరించిన పల్లకీపై పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామిని దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. దేవాలయన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు