
జీవిత యుద్ధ విజేత
తెనాలి: అయిదో తరగతిలో పరుగుపందెం.. ఆరో తరగతి ప్రవేశపరీక్ష... రెండింటిలోనూ ఆ బాలుడు ఓడిపోయాడు. ఓటమి బాధను మించి గెలవాలన్న రోషం పెరిగింది అతడిలో...! బాగా చదువుతూ ఎయిర్ఫోర్స్లో చేరాడు. బయటకొచ్చాక పౌల్ట్రీలోకి వచ్చాడు. అతిపెద్ద పౌల్ట్రీ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. క్రీడా అకాడమీతో క్రీడాకారులను తీర్చిదిద్దాడు. క్రీడారాజకీయాలతో సామాజికసేవకు అంకితమయ్యాడు. సైనికుల తయారీలో తోడ్పాటుకు సిద్ధపడ్డాడు. సైనిక్స్కూలుకు రూ.20 కోట్లకు పైగా విరాళమిచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు సైనిక్ స్కూళ్లకు ప్రణాళికను రచించారు. మరోవైపు అకాడమీనీ పునరుద్ధరించనున్నారు. సంపాదనలో తొంభై శాతం సమాజపరం చేసిన ఆ మాజీ సైనికుడు సీబీఆర్ ప్రసాద్ అలియాస్ చలసాని బలరామయ్య జీవనయాత్ర స్ఫూర్తిదాయకం. అఖిల భారత సేవాపరిషత్ సభ్యులను కలిసేందుకని తెనాలి వచ్చిన బలరామయ్య ‘సాక్షి’తో పంచుకున్న ఆ విశేషాలు.
ఒలింపియన్ కావాలని..
కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు బలరామయ్య సొంతూరు. తండ్రి ఐదెకరాల చిన్న రైతు. అయిదుగురు సంతానం. 5వ తరగతిలో ఫెయిల్యూర్స్ కసితో చదువు, ఆటల్లో ముందుంటూ వచ్చిన బలరామయ్య, తన గ్రామంలో ఒలింపిక్ మెడలిస్ట్ కామినేని ఈశ్వరరావు ఇచ్చిన వెయిట్ లిఫ్టింగ్ ప్రదర్శన చూశాక తానూ ఒలింపియన్ కావాలని ఆశపడ్డాడు. 11వ తరగతిలో పదిమంది బాల్యస్నేహితులు ఫెయిలైతే, తాను మాత్రం ఉత్తీర్ణుడయ్యాడు. ఎయిర్ఫోర్స్ సెలక్షన్లని తెలిసి, జేబులో రూ.5తో 18 ఏళ్లప్పుడు నేరుగా వెళ్లి ఎంపికయ్యాడు. వెయిట్లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగి, ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. మిడిల్ వెయిట్ కేటగిరీలో హెవీ చేసే బలరామయ్య, 1972 ఒలింపిక్స్కు అవకాశం లభిస్తుందని భావించారు. రైల్వేస్ నుంచి మంచి ఆఫర్తో ఏడాది 1971లో ఎయిర్ఫోర్స్ నుంచి బయటకొచ్చేశారు. రెండేళ్లు అపాయింట్మెంట్ రాలేదు. మనస్తాపంతో 1973లో తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో 1500 కోళ్లతో ఫారం పెట్టారు. పదేళ్లలో దేశంలోనే నెంబర్వన్ పౌల్ట్రీ ఫామ్గా విస్తరింపజేశారు. విజయవాడ దగ్గర హేచరీస్ నడిపారు. లక్షన్నర కోళ్లతో రోజూ 75 వేల గుడ్ల ఉత్పత్తి. దేశమంతా పంపిణీదారులు. ప్రపంచంలోని అతి పెద్ద పౌల్ట్రీ కంపెనీ హైలైన్ ఇంటర్నేషనల్కు ఇండియా పంపిణీదారుగా చేశారు. ఎకరం రూ.వెయ్యి చొప్పున మూడున్నర ఎకరాలతో మొదలుపెట్టి 1998 నాటికి 500 ఎక రాల భూమికి యజమాని అయ్యారు. సామాజిక సేవలో ఇప్పటికి 450 ఎకరాలు ఖర్చుకాగా, హైదరాబాద్, విజయవాడలో పాతికేసి ఎకరాల చొప్పున 50 ఎకరాలు మిగిలాయి.
సైనిక్ స్కూళ్లు ఏర్పాటు
సైనికులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో కేతనకొండలోని తన భూమిలో రూ.20 కోట్ల విలువైన 8 ఎకరాల స్థలం, 1.20 లక్షల చదరపు అడుగుల భవనాన్ని విద్యాభారతికి డొనేట్ చేశారు. అక్కడ ‘నేతాజీ సైనిక్ స్కూలు’ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఏపీలో రెండు బాలికల సైనిక్ స్కూళ్లు, తెలంగాణలో బాలుర సైనిక్ స్కూలు ఏర్పాటుకు నిర్ణయించారు. ‘ఒక్కో స్కూలుకు భూమి కాకుండానే రూ.10 కోట్లు కావాలి. ఆర్థిక వనరులు ఉన్నాయి నా దగ్గర... మంచి నిర్వహణ టీమ్ లభిస్తే... ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తాను’ అని చెప్పారు బలరామయ్య. సమాజానికి ఇవ్వడంలో ఆనందం ఉంది. అలాంటి వ్యక్తులే దేశానికి కావాలి. ‘ఇప్పుడు మళ్లీ క్రీడా అకాడమీని పునరుద్ధరించాలనే సంకల్పంతో ఉన్నాను’ అని చెప్పారు.
క్రీడలకు పెద్దఎత్తున ప్రోత్సాహం
వ్యాపారంలో సంతృప్తస్థాయికి చేరుకున్నాక ఒలింపిక్ కల గుర్తుకొచ్చింది. తాను వెళ్లలేకున్నా క్రీడాకారులకు సాయపడాలని 1998 నుంచి క్రీడాకారులకు ఆర్థికసాయం చేస్తూ వచ్చారు. నెలకు రూ.10 లక్షల చొప్పున సాయం చేశారు. ఎందరో క్రీడారత్నాలకు ఆర్థికసాయం అందించారు. 2000లో విజయవాడ దగ్గర్లోనీ కేతనకొండలో సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీని స్థాపించారు. స్పోర్ట్స్ హాస్టల్, స్కూల్, జిమ్, సేంద్రియ వ్యవసాయం, ఉపాధి శిక్షణ అన్నీ ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా కోచ్లను నియమించి రెండుమూడేళ్లలోనే స్కూల్గేమ్స్ నుంచి సీనియర్స్ వరకు వందమందికి శిక్షణనిచ్చారు. వీరిలో 30 మంది అంతర్జాతీయ మెడల్స్ కొట్టినట్టు బలరామయ్య గుర్తుచేసుకున్నారు. కరోనా లాక్డౌన్ వరకు అకాడమీ నడిచింది. ఆసియా, కామన్వెల్త్ గేమ్స్లో పతకాలను సాధించారు. ‘వరల్డ్ యూనివర్సిటీకి ప్రాతినిధ్యంలేని ఇండియా నుంచి మేం టీమ్ను తీసుకెళ్లటం గొప్ప సంతృప్తి’ అన్నారు. ‘క్రీడాసంఘాల్లో అవినీతి, బంధుప్రీతి, రాజకీయాలతో విసుగెత్తి వదిలేశాను’ అని చెప్పారు.
రక్షణ శాఖకు రూ.1.08కోట్ల విరాళం
ఎయిర్ఫోర్స్లో క్రీడాకారుడిగా ఎదిగారు – బయటకొచ్చాక పౌల్ట్రీతో వ్యాపారసామ్రాజ్యం
అకాడమీతో క్రీడాకారుల తయారీ ఇప్పుడు సైనిక్స్కూళ్ల ఏర్పాటుకు తోడ్పాటు
క్రీడాఅకాడమీ పునరుద్ధరణకు సన్నాహాం
సీబీఆర్ ప్రసాద్ అలియాస్ చలసాని బలరామయ్య జీవనయాత్రం స్ఫూర్తిదాయకం
తనకు ఏమీ లేని రోజుల్లో 108 నెలలు ఉద్యోగమిచ్చి పోషించి, క్రీడారంగంలో ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన రక్షణశాఖ రుణం తీర్చుకునేందుకు, అదే రక్షణశాఖకు రూ.108 లక్షలను కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్కు అందజేశారు బలరామయ్య. హైదరాబాద్ సైనిక్పురిలో ప్రభుత్వమిచ్చిన 350 గజాల స్థలాన్ని అమ్మి రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.54 లక్షల చొప్పున రూ.1.08 కోట్లు విరాళంగా ఇచ్చారు. కోవిడ్లో సేవాభారతి కార్యక్రమాలకు బాసటగా రూ.1.08 కోట్లతో ఆరు అంబులెన్సులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేశారు. తొలిగా వ్యాపారం ప్రారంభించిన కుగ్రామానికి కల్యాణమండపం, పుట్టిన ఊరిలో గ్రామపంచాయతీ భవనం, పాఠశాల భవనం నిర్మించారు.

జీవిత యుద్ధ విజేత