
అవగాహనతో మలేరియా కట్టడి చేయవచ్చు
గుంటూరు మెడికల్: అవగాహనతో మలేరియాను కట్టడి చేయవచ్చని జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం అన్నారు. జాతీయ మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక గుండారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుబ్బరాయణం మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లాంటి వ్యాధులు కలుగజేస్తాయన్నారు. దోమలు పెరగకుండా ప్రతి ఒక్కరు తమ చుట్టు పక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి దోమలు పెరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దోమకాటు నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరు దోమ తెరలు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్. హబీద, సబ్యూనిట్ అధికారి ప్రశాంత్ , సబ్ యూనిట్ సూపర్వైజర్లు కె. యన్.సుకుమార్, సూరి, శ్రీనివాసరావు, నరసింహారావు, సచివాలయ ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం