
సాక్షి,గుంటూరు: తాజాగా కోనసీమ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు తనది డేగకన్ను, తప్పు చేసిన వారు తన నుంచి తప్పించుకోలేరంటూ పిట్టలదోరలా మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు.
గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తూ తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై పట్టపగలు ముగ్గురు దళిత, మైనార్టీ యువకులను హింసిస్తే చంద్రబాబు డేగ కన్నుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వారిపై చర్య తీసుకుంటే తాను చట్టవిరుద్దంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వైయస్ఆర్సీపీ శ్రేణులపై పెట్టిస్తున్న తప్పుడు కేసులు, వేధింపులను పోలీసులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. పోలీసుల హింసకు గురైన బాధితులను పరామర్శించేందుకు ఈనెల 3వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెనాలికి వెడుతున్నారని వెల్లడించారు.
ఇంకా ఆయనేమన్నారంటే..తెనాలి అయితానగర్కు చెందిన జాన్ విక్టర్, దోమా రాజేష్,షేక్ బాబూలాల్ అనే యువకులు చిరంజీవి అనే కానిస్టేబుల్పై దాడి చేశారని వారిపై 307 కేసు పెట్టారు. చట్టప్రకారం వారిని అరెస్ట్ చేసి కోర్ట్కు పంపాల్సింది పోయి, వారిని పట్టుకుని నడిరోడ్డుపై లాఠీలతో చావబాదారు. వారంతా దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన వారు. ఈ హింసను చూస్తుంటే అసలు ప్రజస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. దీనిని మానవ హక్కుల సంఘాలు ప్రశ్నిస్తే, వారిపై రౌడీషీట్లు ఉన్నాయని, రౌడీలకు సపోర్ట్ చేస్తారా అని ఎదురుదాడి చేస్తున్నారు. చట్టాన్ని పోలీసులే చేతుల్లోకి తీసుకుంటే ఇక కోర్ట్లు ఎందుకు? విచారణలు ఎందుకు? శిక్షలు ఎందుకు? ప్రజాస్వామిక వ్యవస్థలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి, కోర్ట్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా పోలీసుల పనిచేయాలే తప్ప, తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీలు లేదు. తనది డేగ కన్ను అని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు ఈ దారుణం కనిపించలేదా? పోలీసులను మందలించడానికి ఎందకు భయపడుతున్నారు? ఇటువంటి ఘటనలు సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతాయి.
ఏడాది తరువాత పాలనలో ఏ గేర్ మారుస్తారు?
అవినీతిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. నిత్యం లంచాల సొమ్మతో సూట్కేసులు మోయడమే ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న పని. కోససీమ జిల్లా చేయ్యూరు ప్రజావేదికలో పాల్గొని పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ నెల పన్నెండో తేదీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుందని, ఇకపై పాలనలో గేర్ మారుస్తానని చంద్రబాబు అన్నారు. ఏం గేరు మారుస్తారో మాకు మాత్రం అర్థం కాలేదు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి అబద్దాలను కూడా అవలీలగా చెబుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి అబద్దాలనైనా సరే లైవ్ డిటెక్టర్కు కూడా దొరకకుండా చెప్పగల నేర్పరి. 'అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం, అధికారులు పేదల కోసం పనిచేయాల్సిందే, లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను, నాది డేగ కన్ను, ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా తప్పు చేస్తే ఛండశానసనుడిని అవుతాను' ఇవీ చంద్రబాబు తాజాగా చెప్పిన సుభాషితాలు. అసలు అవినీతి సమాజానికి అంకురార్పణ చేసిందే చంద్రబాబు. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరుగుతోంది. దానికి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఈ అవినీతి సొమ్మును వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. సీఐల బదిలీల నుంచి అన్ని పోస్టింగ్లకు ఒక రేటును పెట్టి, లంచాలు దండుకుంటున్నది నారా లోకేష్ అనేది సత్యం. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ప్రజలను మోసం చేసిన వైనంను ప్రశ్నిస్తూ ఈనెల 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తి, మిర్చి, పొగాకు, ధాన్యం ఇలా ఏ పంట పండిచే రైతుల గురించి కూడా పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ స్టంట్ కోసం చేసే ప్రయత్నం తప్ప ప్రజలను నిజంగా మేలు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదు. వైఎస్సార్సీపీ నిరసనలతో ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం.

అవినీతిపై బెల్ట్ తీసే సీఎంకు బెల్ట్షాప్కు కనిపించవా?
చంద్రబాబు తనది డేగ కన్ను అంటున్నాడు, బెల్ట్ షాప్లు పెడితే బెల్ట్ తీస్తాను అని కూడా హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లు కనిపిస్తున్నాయి. ఆయనది డేగ కన్ను ఎలా అవుతుంది? ఆ షాప్లు ఎందుకు కనిపించడం లేదు? బడులు తెరవగానే అమ్మ ఒడి ఇస్తానని చెబుతున్నాడు. ఏడాది కిందట కూటమి పార్టీ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు బడులే తెరవలేదా? ఈ ఏడాదే బడులు తెరుస్తున్నారా? ప్రతి విద్యార్ధికి రూ.పదిహేను వేలు అంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం వారు చేసిన హామీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఏవీ ఆ పదిహేను వేలు అంటూ తల్లులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఏ వర్గం సంతోషంగా ఉంది? విద్యార్ధులు, యువకులు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, కనీసం అమరావతి రైతులు సైతం సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైన పాలనను ఈ ఏడాది కాలంలో ప్రజలు చవిచూశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అయిదేళ్లు, చంద్రబాబు ఏడాది పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది, ఉన్న ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం కూటమిది. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తానంటూ నమ్మించి దాదాపు 2.60 లక్షల మందిని రోడ్డుపాలు చేశారు. ఏపీ ఫైబర్నెట్, బేవరేజెస్, ఏపీఎండీసీల్లో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలను తొలగించారు.
ఎండీయులతో 72 నెలల ఒప్పందాన్ని కొనసాగించాలి
ఈ రోజు రేషన్ వాహనాలపై ఆధారపడిన ఎండీయు ఆపరేటర్ల ఉద్యోగాలను కూడా తొలగించారు. 9260 మందికి ఎండీఓ వాహనాలను లోన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది. వారితో పాటు ఒక హెల్పర్తో కలిపితే మొత్తం ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాం. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే వారిని రోడ్డుపాలు చేశారు. ఇదే ఎండీయులతో గత ప్రభుత్వం 72 నెలల పాటు కొనసాగేలా అగ్రిమెంట్ ఉంది. అది పూర్తి కాకుండానే వారిని తొలగించారు. ఇది చట్ట విరుద్దం. వారిపై ఇంత కక్షసాధింపు ఎందుకు? బుడమేరు వరదల్లో వారు కష్టపడి పనిచేసిన కూడా వారిని నమ్మించి గొంతుకోశారు. చట్టవిరుద్దంగా తమను తొలగించారంటూ ఇప్పటికే కొందరు ఎండీయులు న్యాయస్థానాలకు కూడా వెళ్ళారు.
మంత్రి నాదెండ్ల మనోహరే పీడీఎస్ బియ్యం స్మగ్లర్
వారిని తొలగించే సమయంలో చంద్రబాబు ఎండీయులను గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. ఎండీయుల ద్వారా పనిచేసే వారంతా స్మగ్లర్లని, కాకినాడ పోర్ట్కు రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని సంచలనమైన ఆరోపణలు చేశారు. వారంతా సంఘవిద్రోహశక్తులు అని మాట్లాడారు. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు, ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు స్మగ్లర్లుగా మారారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ద్వారా ఎమ్మెల్యేలకు వాటాలు అందుతున్నాయి. కాకినాడ నుంచి ఆఫ్రికాదేశాలకు వెళ్ళే బియ్యం అంతా స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమ రవాణా జరుగుతోంది. మట్టి, ఇసుక, ఉద్యోగాల బదిలీలు, పీడీఎస్ బియ్యంను అడ్డం పెట్టుకుని అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు. ఎండీయుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. సివిల్ సప్లయిస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ అక్రమ పీడీఎస్ రవాణా వ్యవహారంలో మొదటి స్మగ్లర్. తరువాత మంత్రి నారా లోకేష్. మీరు అక్రమాలు చేస్తూ, ఎండీఓలపై ఆరోపణలు చేయడం దారుణం.