
విశ్లేషణ
భారత్, చైనా సమవుజ్జీలేనా? డాలర్లలో చూసినపుడు, 1990 ప్రాంతంలో భారత్, చైనా ఇంచుమించుగా ఒకే ఆర్థిక పరిమా
ణంలో, ఒకే రకమైన తలసరి ఆదాయంతో ఉన్నాయి. నిజానికి, అప్పట్లో చైనాలో తల సరి ఆదాయం మనకన్నా తక్కువగా ఉండేది. సుమారు 190 దేశాల జాబితాలో రెండు దేశాలు 140 నుంచి 145 మధ్య స్థానాల్లో ఉండేవి. చైనాలో ఆర్థిక సంస్కర ణలు 1978లో మొదలయ్యాయి.
వారి వృద్ధి వెంటనే ఏమీ వేగం పుంజుకోలేదు. తర్వాత, పదమూడేళ్ళకి, అంటే 1991లో భారత్ సంస్కరణల బాటపట్టింది. ఇపుడు ప్రపంచంలో చైనాది రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. అది 2010లోనే ఆ స్థితికి చేరింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకారం, భారత్ కొద్ది రోజుల క్రితం, నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. వచ్చే మూడేళ్ళలో జర్మ నీని దాటి, భారత్ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది.
ఎంతో ఎదిగినా... ఇంకా వెనకే!
భారత్, చైనా గత మూడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి అద్భుతం, చారిత్రకం, అసాధారణం. ఆసియాలోని ఈ రెండు దిగ్గ జాల జనాభా ప్రపంచ జనాభాలో నలభై శాతం మేరకు ఉంటుంది. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ సైజు సుమారు 4.1 ట్రిలియన్ల డాల ర్లుగా ఉంది. దానికన్నా ఐదింతలు ఎక్కువగా చైనాది 19 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. భారత సంఖ్యామానం ప్రకారం ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లతో సమానం.
భారత్ 2000 నుంచి 2024 వరకు 6.3 శాతం వార్షిక వృద్ధిని కనబరచిందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఇది వేగవంతమైన వృద్ధి రేటు. ఇటీవలి సంవత్సరాల్లో, భారత్ వృద్ధి రేటు సుమారు 7.3 శాతానికి పెరిగింది. ఇక 1990 నాటి స్థితితో పోలిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ ఇపుడు 11.5 రెట్లు పెద్దదిగా ఉంది. జనాభా 1.6 రెట్లు మాత్రమే పెరిగింది. మరో విధంగా చెప్పాలంటే, 1990లో సుమారు 360 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం 2025 నాటికి 2,700 డాలర్లకు పెరిగింది.
అయినా చైనాతో వైరుధ్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.రెండు దేశాలు 1990లో ఒకే విధమైన తలసరి ఆదాయంతో ఉన్నాయి. చైనాలో తలసరి ఆదాయం 2025లో భారత్ కన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా 13,000 డాలర్లకు దూసుకొచ్చింది. చైనా ఆర్థిక వ్యవస్థ గత 35 ఏళ్ళలో 51 రెట్లకు పైగా విస్తరించింది. చైనా మూడు దశాబ్దాలపాటు 10 శాతం వృద్ధి రేటును కొనసాగించగలిగింది.
మొత్తం 197 దేశాల్లో నేడు భారత్ 141వ స్థానంలో ఉండగా, చైనా 70వ ర్యాంకునకు ఎగబాకింది. ప్రపంచ బ్యాంక్ ప్రకారం, భారత్ ఇపుడు మధ్యాదాయ కేటగిరీలో స్థిరంగా ఉంది. చైనాను అధిక –ఆదాయ దేశంగా పరిగణిస్తున్నారు. తలసరి ఆదాయం 14,000 డాలర్ల ఎగువున ఉంటే అలాంటి హోదా దక్కుతుంది. ఆ వాకిలిని కూడా దాటినవాటిని ప్రపంచ బ్యాంక్ అభివృద్థి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా గౌరవిస్తుంది.
భారత్ 2047 నాటికి ఎలాగైనా ఆ స్థితిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ కల సాకారమవడానికి, మనం వచ్చే 20 ఏళ్ళపాటు డాలర్లలో సగటున 7.8 శాతం వృద్ధి వేగాన్ని అందుకుని, అదే రీతిలో కొనసాగవలసి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో, మనం చూపిన 7.3 శాతం వృద్ధి రేటుకన్నా అది కాస్త ఎక్కువ.
ఎందుకు వెనకబడ్డాం?
భారత్ 1990–2025 మధ్య కాలంలో చైనాతో పోల్చుకుంటే, ఎందుకు వెనుకబడింది? ఎగుమతులు, ముఖ్యంగా శ్రమ శక్తి ద్వారా ఒనగూడే ఎగుమతుల ప్రాబల్యం విషయంలో, ఉన్న సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేయబట్టా? ప్రాథమిక ఆరోగ్య, విద్య రంగాలకు తక్కువ పెట్టుబడులు ఉండబట్టా? మనం 1991లో చాలా వరకు రద్దు చేసు కున్న లైసెన్సుల వ్యవస్థ స్థానంలో ఇన్స్పెక్టర్ల వ్యవస్థ ఏర్పడబట్టా? లేక సాఫీగా వ్యాపారాలు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న మన దేశంలోని మూడంచెల పాలనా వ్యవస్థే దీనికి కారణమా? లేక మన దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థకుగాను నత్తనడకన సాగే వృద్ధి రూపంలో మూల్యం చెల్లించుకోక తప్పదా?
చైనాతో పోల్చుకుంటే భారత్ పనితీరు పేలవంగా ఉండటానికి సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ప్రశ్నలకు జవా బులు అన్వేషించడం వల్ల ఇప్పటికిప్పుడు ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు కనుక వాటినక్కడ వదిలేద్దాం. వృద్ధి రేటును సాధించ డానికి, అది కూడా వచ్చే ఇరవై ఏళ్ళపాటు స్థిరంగా కొనసాగించ డానికి ఏం చెయ్యవలసిన అవసరం ఉందో దానిపై దృష్టి కేంద్రీకరించడం మనందరి తక్షణ కర్తవ్యం.
అది సమ్మిళిత వృద్ధి అయితే, తలసరి ఆదాయాలు కూడా పెరుగుతాయి. అంటే, ఉత్పాదకత, వేతనాలు, కుటుంబాల ఆదాయాలు, ఉన్నత–గుణాత్మక ఉద్యోగాలు వృద్ధి చెందాలి. దాన్ని సాధించకపోతే, 2047 నాటికి భారత్ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందుతుందేమోకానీ, మధ్యా దాయ కేటగిరీలో చిక్కుకుపోతుంది. తలసరి ఆదాయం ఎదుగు బొదుగు లేకుండా 10,000 డాలర్లకు దిగువన ఉండిపోవచ్చు.
ప్రపంచ బ్యాంక్ రికార్డులను తిరగేస్తే, గత యాభై ఏళ్ళలో, చాలా దేశాలు అటువంటి గతినే పొందాయని తేలుతుంది. మధ్య– ఆదాయ కేటగిరీ నుంచి అధిక– ఆదాయ కేటగిరీకి 34 దేశాలు మాత్రమే ఎగబాకగలిగాయి. దాదాపు 108 దేశాలు మధ్య– ఆదాయ వలలోనే చిక్కుకుపోయాయి. అమెరికన్ల తలసరి ఆదాయంలో సుమారు పదవ వంతుకి, లేదా ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే, సుమారు 8000 డాలర్లకు మాత్రమే అవి పరిమితమైపోయాయి.
ఏం చేయొచ్చు?
మధ్య–ఆదాయ వల నుంచి తప్పించుకునేందుకు, భారత్ బహుశా, దక్షిణ కొరియా (అత్యంత ఆకర్షణీయమైన పరిణామం), చిలీ, పోలెండ్ల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక దేశం మధ్య –ఆదాయం నుంచి అధిక–ఆదాయానికి పరిణామం చెందేందుకు మూడు (పెట్టుబడి, ప్రేరణ, నవీకరణ) టానిక్లు అవసరమని ప్రపంచ బ్యాంక్ పరిశోధన వెల్లడిస్తోంది.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ స్థాయిని అందుకునేందుకు అన్ని రాష్ట్రాలు (సూటిగా చెప్పాలంటే, ఆయా రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, గ్రామాలు) కలసికట్టుగా కృషి చేయాలని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థించారు.
ఉద్యోగాలు, ఉత్పత్తి, ఎగు మతులు పెరిగేందుకు దోహదపడగల చిన్నతరహా (సూక్ష్మ సంస్థలు కాదు) సంస్థలకున్న వృద్ధి సామర్థ్యానికి పడిన సంకెళ్ళనన్నింటినీ తెగ్గొట్టాలని కోరారు. ప్రధానంగా, రాష్ట్రాల అంశాల జాబితాలోకి వచ్చే వ్యవసాయ రంగానికున్న ప్రతిబంధకాలన్నింటినీ తొలగించు కోవాలని కూడా ఆ మాటల తాత్పర్యం.
స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 40 శాతానికి భారత్ పెట్టు బడులు పెంచుకోవాలి. మహిళా శక్తి భాగస్వామ్యాన్ని 35 శాతం
నుంచి 50 శాతానికి పెంచుకోవాలి. గ్లోబల్ వాల్యూ చైన్లు, వాణిజ్య ఒప్పందాలు, విదేశీ పెట్టుబడులకు అడ్డంకిగానున్న సుంకాలను తగ్గించడం, అవరోధాలను తొలగించడం ద్వారా నూతన టెక్నా లజీల టానిక్ను వ్యవస్థలోకి చొప్పించాలి.
పరిశోధన, అభివృద్ధి రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా నవీకరణకు దారులు తెరవాలి. నైపుణిని, శిక్షణను, ఉద్యోగ నియామక అర్హతలను ఇబ్బడిముబ్బడిగా పెంపొందించడం ద్వారా మానవ ప్రతిభ వ్యుత్పత్తుల మూలధనాన్ని పోగేసుకోవాలి.
భారత్ ఎదుట మరో పెను సవాల్ ఉంది. అది 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి తీసుకురావడం. ఈ సవాల్ను ఎదుర్కొంటూనే భారత్ లక్ష్య సాధనకు కృషి చేయాలి.
అజీత్ రణడే
వ్యాసకర్త ఆర్థికవేత్త
(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)