ఆధ్యాత్మికథ
గోపాల్ అనే ఒక శిల్పి చాలా బాగా విగ్రహాలు చెక్కేవాడు. కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది అదే ‘అతి ఆలోచన.’ ఒకరోజు అతనికి ఒక పెద్ద దేవాలయం నుంచి అమ్మవారి విగ్రహం చెక్కే అవకాశం వచ్చింది. దానికి చాలా మంచి పారితోషికం కూడా ఇస్తామన్నారు. గోపాల్ ఇంటికి వచ్చి ఆలోచించడం మొదలుపెట్టాడు. ‘ఈ విగ్రహం చాలా అద్భుతంగా రావాలి... ఒకవేళ చెక్కేటప్పుడు రాయి పగిలిపోతే? ఊరిలో నా పేరు పోతుందేమో! ప్రజలు నన్ను చూసి నవ్వుతారేమో! నేను విజయవంతంగా పూర్తి చేయగలనా?’’ ఇలా ఆలోచనలతోనే రోజులు గడిపాడు. భయం, ఆందోళన పెరిగిపోయాయి. చేతిలో ఉలి పట్టుకోవడానికే భయపడి, రోజు రోజుకీ పనిని వాయిదా వేస్తూ వచ్చాడు.
ఒకరోజు ఊరి చివర ఉండే ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్లాడు గోపాల్. తన మనసులోని అతి ఆలోచనలను, భయాలను గురువుతో చెప్పుకున్నాడు. గురువు చిరునవ్వు నవ్వి, ఒక ఖాళీ కుండను, కొద్దిగా నీటిని గోపాల్ చేతికి ఇచ్చి, ‘ఈ కుండను నీటితో నింపు’ అన్నారు.
గోపాల్ కుండ కింద పడిపోతుందేమో, నీళ్లు ఒలికిపోతాయేమో అని అతిగా ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా, భయపడుతూ మెల్లగా నీళ్లు పోస్తున్నాడు. గురువు వెంటనే,‘గోపాల్, నువ్వు నీళ్లు పోసేటప్పుడు నీ దృష్టి అంతా ‘నీళ్లు ఒలికిపోతాయేమో’ అనే భయం మీద ఉంది. అందుకే నీ చెయ్యి వణుకుతోంది. నీ పని కేవలం కుండలో నీళ్లు పోయడం (అంటే ఆచరణ). నీళ్లు ఒలికినా పరవాలేదు, మళ్లీ పోయవచ్చు. ఫలితాన్ని దేవుడికి వదిలేసి, ప్రస్తుతం నీ చేతిలో ఉన్న ఆ ఒక్క చిన్న పని మీద మాత్రమే దృష్టి పెట్టు. దాన్నే భగవద్గీతలో ‘కర్మయోగం’ అంటారు’ అని చె΄్పారు.
గోపాల్కి జ్ఞానోదయమైంది. తన అతి ఆలోచనలు లౌకికమైన ‘భయం, అహం (పేరు పోతుందేమో అనే భావన)’ నుంచి వస్తున్నాయని గ్రహించాడు. ఆలోచించడం ఆపి, ఆధ్యాత్మిక భావనతో (పనిని దేవుడికి అర్పించే భక్తితో) మరుసటి రోజే ఉలి, సుత్తి చేతపట్టాడు. ఫలితం ఎలా వచ్చినా సరే, నా వంతు కృషి నేను చేస్తాను’ అని మనస్ఫూర్తిగా చెక్కడం మొదలుపెట్టాడు.
కొద్ది రోజుల్లోనే అతను తన జీవితంలోనే అత్యంత అందమైన విగ్రహాన్ని తయారు చేశాడు. అతి ఆలోచనలు మనల్ని భయానికి గురిచేసి ముందడుగు వేయనివ్వవు. కానీ ఆధ్యాత్మికతతో కూడిన ఆలోచన మనకు ‘స్వీకరణ భావాన్ని’, ఫలితం మీద ఆశ లేని ధైర్యాన్నిస్తుంది. ఆలోచనలకు ఆచరణ తోడైతే విజయం తథ్యం. ఆలోచన ఒక ఆయుధం అయితే, ఆధ్యాత్మికత దానికి సరియైన దిశానిర్దేశం చేస్తుంది. ఆలోచన ఆధ్యాత్మికమైనప్పుడు, పొందే ప్రశాంతత మానసిక ఉన్నతికి, సాధించే విజయం ఆత్మోన్నతికి దారితీస్తాయి....
– తరిగొప్పుల వి ఎల్లెన్ మూర్తి
తపస్సు అంటే..?
అమృత బిందువులు
→ తపస్సు అంటే అడవికి పోయి పండ్లు, దుంపలను తింటూ నివసించడం కాదు. తమ భావాలను, ఆలోచనలను నియంత్రించడమే నిజమైన తపస్సు.
→ ఎక్కడ ఉన్నా, ఎల్లప్పుడూ దేవుని గురించి ఆలోచించడమే నిజమైన తపస్సు.
→ ఆలోచనలు, మాటలు, పనులలో సమానత్వాన్ని సాధించడమే తపస్సు ముఖ్య లక్షణం.
→ ఆనందం, దుఃఖం, లాభం నష్టం, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి.
→ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సమాజానికి సేవ చేయాలి, కోరిక లేని స్థితికి చేరుకోవాలి. అదే నిజమైన తపస్సు.


