
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుణ్ణి శాస్త్రోక్తంగా అర్చించటం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కానిపని. అలాంటిది సామాన్య మానవులు జరిపే శాస్త్రోక్త విధానమైన భగవత్పూజా విధానం అతిదుస్సాధ్యమని చెప్పచ్చు. ఎందుకంటే స్వామివారికి జరిగే నిత్యపూజల్లో, ఉత్సవాలలోనూ ద్రవ్య మంత్రతంత్రాది లోపాలు అనేకం చోటు చేసుచేసుకోవడం పరిపాటి. ఇలా తెలిసీ తెలియక జరిగిన దోషనివృత్తికి ప్రత్యేకంగా ఉత్సవ రూపాల్లో ఉన్న ఒక ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉన్నది. దానికే పవిత్రారోపణం లేక పవిత్రోత్సవం అని పేరు. ఆగస్టు 3 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్న సందర్భంగా....
పవిత్రోత్సవం అంటే పరమపవిత్రమైన ప్రాయశ్చిత్త మహోత్సవం. సంవత్సరానికొకసారి ఆలయ పవిత్ర వాతావరణం పునఃస్థాపితం కావడానికి జరిపే ఉత్సవమిది. ఆలయాల్లో సంవత్సర పర్యంత చేసే ఆరాధనలలో జరిగే దోషాలను నిత్య, నైమిత్తిక, కామ్య ఉత్సవాలైన నిత్యారాధనాహోమ (బలి) నివేదన, బలి సమర్పణలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జ్యేష్టాభిషేక, సహస్రకలశ స్నపన, ఆరాధనాదులు, దేశ ప్రజాజనహితార్థం ఆచరించే యజ్ఞ యాగాది క్రియలలో జరిగే మంత్ర, తంత్ర, క్రియారూప, శౌచ, అశౌచ దోషనివారణకై స్వామికి జరిపించే ఉత్సవం.
ఈ పవిత్రోత్సవంలో పూసలుగా అమర్చబడిన మాలలను ప్రతిష్టించి శ్రీస్వామివారికి, ఆలయపరివార దేవతలకు సమర్పించటం ప్రధానఘట్టం. పవిత్ర సూత్రాలను పవిత్రమండపంలోని పీఠంలో ఉంచి వాటిని దర్భకొసలతో కూడిన పంచగవ్యాలతో ప్రోక్షణ చేసి ఆగమోక్త విధానంగా వాటిని ప్రతిష్టించి ఉక్తహోమం జరిపి ఉత్సవమూర్తులకు అష్టకలశ స్నపనం జరిపి ధ్వజ ఛత్ర చామర పింఛ నృత్య గేయ సమాయుక్తంగా ఆచార్యుడు ఆలయ ప్రదక్షిణం చేసి దేవదేవుణ్ణి విశేషంగా అర్చించి అష్టోత్తరశత పవిత్ర సూత్రాలను జాను పర్యంతం సమర్పించడం ఉత్తమం.
చతుః పంచాశత్ (54) సూత్రములను ఊరువుల వరకు సమర్పిస్తే మధ్యమం. సప్తవింశతి (27) సూత్రాలను నాభ్యన్తం సమర్పిస్తే అధమం అని ఆగమోక్తం. వీటిలో యథాశక్తి సమర్పించాలి. పవిత్రములను ఈవిధంగా దేవ దేవునికి ఆరోపణ చేయటమే పవిత్రారోపణం. ఇదే విధంగా పరివారదేవతలకు కూడా ఒక్కొక్కరికీ సమర్పించాలి. ముందుగా అంకురార్పణ చేయాలి. ఇది దాదాపు అన్ని ప్రధాన ఆలయాలలోనూ సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా జరిపించవలసిన ఉత్సవం.
తిరుమలలో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రితజన వత్సలుడు అయిన శ్రీమన్నారాయణునికి వైఖానసాగమోక్తంగా జరిగే ఈ పవిత్రోత్సవం భక్తితో చేయించినా, కళ్లారా దర్శించినా భక్తులు సర్వ పాపల నుంచి విముక్తి పొంది యశస్సు, సంపద, సంవత్సరార్చన ఫలం, విష్ణుసాయుజ్యం, అశ్వమేధయాగ ఫలం, సర్వోపద్రవనివారణయేగాక సర్వాభీష్టఫలాలు పొంది నిర్భీతులై, ధర్మ తత్పర నిష్టాగరిష్టులై సుఖిస్తారని భృగు సంహిత చెబుతోంది.
పవిత్రోత్సవం అనే మాటకు పవిత్రీకరణ కార్యక్రమమని పేరు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేముందు వ్రేలికి దర్భతో చేయబడిన పవిత్రం ధరించి కార్యక్రమం జరపడం అలవాటు. దీనివల్ల కార్యక్రమానికి మానసికంగా యజమానికి నిర్మలతత్త్వం చేకూరుతుందనేది సంప్రదాయం.
ఆలయాల్లో పవిత్రోత్సవం ఏడాదికొక పర్యాయం ఆలయపవిత్ర వాతావరణం పునఃస్థాపితమయ్యేందుకు జరుగుతుందని చెప్పుకున్నాం కదా... ఐతే ఇది బ్రహ్మోత్సవాది సందర్భాల్లో, అంతకు ముందు బలిపీఠాల వద్ద, మూలబేరం వద్ద జనసమ్మర్దం వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని పోగొట్టేందుకు జరిపే సంప్రోక్షణం కన్నా భిన్నమైంది. దానికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని పేరు. పవిత్రోత్సవంలో మంత్ర, వేద, పురాణపారాయణాది కార్యక్రమాల ద్వారా భగవానుడే లేదా మూలమూర్తే విద్యుదుత్పాదక యంత్రంగా పనిచేయడం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో తిరుమల వేంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఈ రోజుల్లో శ్రీవేంకటేశ్వర స్వామి, ఆయన దేవేరులతో పాటు ఉత్సవ విగ్రహాలు ఆలయ కల్యాణ మండపంలోని యాగశాలలో ఉంచబడి ఉత్సవానంతరం పూర్ణాహుతి అయిన తర్వాత మరల ఆలయప్రవేశం గావించబడతాయి. ఈ దినాల్లో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారు.
మొదటిరోజున పట్టుపోగులతో తులసిపూసలు లేదా తామరతూడు సరంలా కనిపించే పవిత్రాలను యాగశాలలో ఉంచుతారు. రెండవరోజున శాస్త్రోక్త మర్యాదలతో ఈ పవిత్రములను శ్రీవారి ఆలయానికి, బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి నడుమగల ప్రధాన ఇతర పరివారదేవతలకు సమర్పించటం జరుగుతుంది. మూడవరోజున పవిత్ర విసర్జనం జరుపబడి పూర్ణాహుతితో ఉత్సవం సమాప్తమవుతుంది.
చారిత్రకంగా ఈ పవిత్రోత్సవం 15వ శతాబ్దంలో అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆలయ పవిత్రతను కాపాడటానికి, ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల లేదా సిబ్బంది వల్ల తెలియకుండా జరిగే దోషాలను నివారించడానికి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు.
శ్రావణ శుద్ధ ఏకాదశినాడు ఉత్సవమూర్తిని తిరుమామణిమండపంలో వేంచేపు చేస్తారు. ద్వాదశినాడు తలకు, మెడకు, మణికట్టుకు తిరుపవిత్రంతో అలంకరించి దేవేరులతో కూడా ఊరేగింపు జరుపుతారు. శ్రావణ శుక్లద్వాదశి విష్ణు పవిత్రారోపణ దినంగా తులసి పెంచటానికి ఉపయోగించే భూమిలో పెరిగిన ప్రత్తి చెట్లనుండి తీసిన దారంతో ఈ పవిత్రం చేస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అన్నప్రసాద నివేదన తప్పకుండా జరుగుతుంది.
ఈ పవిత్రోత్సవాలను ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజమాసాల్లో శుక్లపక్షంలోని పాడ్యమి, విదియ, పంచమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమిల్లో భరణి, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, రేవతి, శ్రవణం మొదలైన నక్షత్రాల్లో ఆచరించాలని పంచరాత్రాగమం చేస్తోంది. ఈ పవిత్రోత్సవాల్లో ఉపయోగించే పవిత్రాలు బంగారు, వెండి, రాగి, మృణ్మయం, పత్తి, ముంజ గడ్డి, దర్భ, పట్టు మొదలైనవాటితో చేస్తారు. అలా చేసిన పవిత్రాలను ఆచార్యుడు స్వీకరించి, పంచగవ్యాదులతో ప్రోక్షించి, ఆ ఆలయాగమాన్ననుసరించి పవిత్రాలకు యజ్ఞ ఆరాధనాదులను పూర్తి చేస్తారు.
వీటిని స్వామికి సమర్పించడంవల్ల సర్వులకూ ఆయుః క్షేమాభివృద్ధి కలుగుతుంది. శ్రీమన్నారాయణారాధనను అత్యంత భక్తిశ్రద్ధలతో సంవత్సర కాలం చేస్తే కలిగే ఫలితమంతా పవిత్రారోపణమాచరిస్తే కలుగుతుందని ప్రతీతి.
చదవండి: శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?
ఈ పవిత్రోత్సవం (Pavithrotsavam) మహా ప్రాయశ్చిత్తం కాబట్టి ప్రతీ సంవత్సరం చేయాలి. ఈ ఉత్సవం అలా ఆచరించకున్నా పరమాత్మకు ఆ సంవత్సరకాలం చేసిన ఆరాధనమంతా నిష్పలమవుతుంది. అందువల్ల ఈ ఉత్సవాన్ని ప్రతిసంవత్సరం ఆచరించాలని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ విగ్రహాల్ని యాగశాలలో ఉంచడం, ఆ తర్వాత రోజు పవిత్రాలు యాగశాలలో ఉంచడం, తర్వాత పవిత్రసమర్పణం, పూర్ణాహుతి జరిపి ఉత్సవాలకు స్వస్తి వాచకం పలుకుతారు.
ఎప్పుడు ప్రారంభం...
ఈ పవిత్రోత్సవాలు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ముఖ్యమైన రోజులలో మూడు రోజుల పాటు జరుగుతాయి. ఉత్సవాలకు ముందు రోజు ‘అంకురార్పణం’తో ప్రారంభమవుతాయి, ఇందులో నవధాన్యాలను మట్టి పాత్రలలో విత్తుతారు.
ముఖ్య ఉద్దేశ్యం...
ఏడాది పొడవునా జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
- డి.వి.ఆర్. భాస్కర్