ప్రేతాత్మ చెప్పిన కథ..! | Seth Speaks: The Eternal Validity of the Soul | Sakshi
Sakshi News home page

ప్రేతాత్మ చెప్పిన కథ..! ఆత్మ స్వయంగా చెప్పిన స్టోరీ..

May 31 2026 4:32 PM | Updated on May 31 2026 4:32 PM

Seth Speaks: The Eternal Validity of the Soul

ప్రపంచ సాహిత్యంలో ఆత్మకథలు చాలానే ఉన్నాయి. ఆత్మకథల సంగతి అటుంచితే, ప్రేతాత్మ కథ కూడా ఒకటి ఉంది. ‘సేత్‌ స్పీక్స్‌’ అనే పుస్తకం అచ్చంగా ప్రేతాత్మ చెప్పిన కథేనట! ఈ పుస్తకం రచయిత్రి జేన్‌ రాబర్ట్స్‌– పుస్తకం రాసినది తానే అయినా, తనతో రాయించినది మాత్రం సేత్‌ అనే వ్యక్తి ఆత్మ అని ప్రకటించడం విశేషం. జేన్‌ రాబర్ట్స్, ఆమె భర్త రాబర్ట్‌ బట్స్‌ 1963 డిసెంబర్‌ 2న రాత్రివేళ సరదాగా ‘ఊజా బోర్డు’తో ఆత్మలను ఆహ్వానించే ప్రయోగం చేశారు. ఊజా బోర్డు ప్రయోగం చేస్తున్నప్పుడు జేన్‌కు ఒక అశరీరవాణి వినిపించిందట! 

ఇదివరకే మరణించిన ఒక పురుషుడి ఆత్మ తనను తాను ‘సేత్‌’గా పరిచయం చేసుకుని, తన కథ చెప్పడం మొదలుపెట్టింది. సేత్‌ ఆత్మ చెప్పిన కథనే తాను పుస్తకంగా రాశానని జేన్‌ రాబర్ట్స్‌ అప్పట్లో ప్రకటించడం సాహితీ ప్రపంచంలో కలకలం రేపింది. సేత్‌ తనకు చెప్పిన కథలను జేన్‌ వరుసగా పుస్తకాలుగా తీసుకొచ్చారు. అవి ‘సేత్‌ మెటీరియల్‌’గా ప్రాచుర్యం పొందాయి. ఈ ప్రేతాత్మ కథకు సంబం«ధించిన పుస్తకాలు ఇప్పటికీ పునర్ముద్రణ పొందుతూనే ఉన్నాయి.

బంగారు మ్యూజియం
ప్రపంచంలోనే అత్యంత అరుదైన బంగారు వస్తుప్రదర్శనశాల ఇది. ఇందులోకి అడుగుపెడితే, ఎటు చూసినా పురాతనమైన బంగారు వస్తువుల ధగధగలు కళ్లు చెదిరేలా చేస్తాయి. ఈ మ్యూజియం కొలంబియా రాజధాని బొగోటాలో ఉంది. కొలంబియా స్పానిష్‌ పాలకుల అధీనంలోకి చేరక మునుపటి కాలానికి చెందిన పురాతన బంగారు, బంగారు మిశ్రమ లోహాల కళాఖండాలను ఇందులో భద్రపరచారు. ఈ మ్యూజియం చూడటానికి ఏటా ఐదులక్షలకు పైగా సందర్శకులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. 

Advertisement
 
Advertisement
Advertisement