హెయిర్‌ కట్‌.. 2కోట్లు! | Rs 2 Crore Compensation For Faulty Haircut Unjustified | Sakshi
Sakshi News home page

హెయిర్‌ కట్‌.. 2కోట్లు!

Apr 12 2026 2:46 AM | Updated on Apr 12 2026 2:48 AM

Rs 2 Crore Compensation For Faulty Haircut Unjustified

జుట్టు ఉన్న ఆమె ఎన్ని ముడులైనా వేస్తుందట....అలానే ఓ యువతి తన కురులను మరింత అందంగా.. ఆకట్టుకునేలా మార్చుకోవాలనుకుంది..దీనికోసం స్టార్‌ హోటల్‌లోని ఓ బ్యూటీ సెలూన్‌కి  వెళ్లింది. ఎలా చేయాలో హెయిర్‌ డ్రెస్సర్‌కు చెప్పింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది..అందం మాట అటుంచి..ఉన్న జుట్టును కోల్పోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని, పరిహారం అందించాలని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. పెద్ద మొత్తంలో పరిహారాన్ని కోరింది..ఏడేళ్ల పాటు ఈ కేసు సాగింది. ఓ హెయిర్‌ కట్‌ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది..చివరకు పరిహారం విషయంలో కీలక తీర్పుతో కేసు ముగిసింది.

ఢిల్లీకి చెందిన ఆశ్నా రాయ్‌ ఓ కార్పొరేట్‌ ఉద్యోగి. ఓ ప్రముఖ హోటల్‌లోని బ్యూటీ సెలూన్‌కి వెళ్లి...తన జుట్టును చివరి నుంచి నాలుగు అంగుళాలు కత్తిరించాలని చెప్పింది. అయితే, ఆమె చెప్పిన దానికి భిన్నంగా జరిగింది. పైనుంచి కిందికి నాలుగు అంగు ళాలు మాత్రమే జుట్టు మిగిలింది. దీనిపై నిర్వాహకులను నిలదీసింది..‘సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..’ అని ఆమె అంతటితో సరిపెట్టుకోలేదు. 

న్యాయపోరాటం ప్రారంభం
ఆశ్నారాయ్‌ 2018లో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ)ని ఆశ్రయించింది. సేవల్లో లోపంపై ఫిర్యాదు చేసింది. మానసికంగా తాను పడిన ఆవేదనను వెళ్లగక్కింది. మోడలింగ్, సినిమా రంగాల్లోకి అడుగు పెట్టాలనుకున్నానని..తన జుట్టు కారణంగా ఉన్న ఉపాధి అవకాశాలు పోయాయని, కొత్తవి చేజారాయని ఫిర్యాదులో పేర్కొంది. విచారణ అనంతరం ఆమెకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశించింది. 

‘సుప్రీం’కు చేరిన కేసు
ఆ తీర్పును సవాల్‌ చేస్తూ హోటల్‌ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సేవల లోపంపై కమిషన్‌  నిర్ధారణను ‘సుప్రీం’ సమర్థించింది..కానీ ‘పరిహారాన్ని కేవలం డిమాండ్‌ ఆధారంగా కాకుండా, సరైన ఆధారాలతో నిర్ణయించాలని స్పష్టం చేసింది. కేసును తిరిగి కమిషన్‌కు పంపింది. మరోసారి విచారించి రూ. 2 కోట్ల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని కమిషన్‌ తీర్పు ఇచ్చింది. 

సాక్ష్యాలపై సందేహాలు
బాధితురాలి వాదనతో యాజమాన్యం ఏకీభవించ లేదు. సమర్పించిన పత్రాలన్నీ ఫొటోకాపీలేనని, వాటికి విశ్వసనీయత లేదని వాదించింది. తనకు జరిగిన నష్టం, మానసిక వేదనకు పరిహారం చెల్లింపులో సాంకేతిక అంశాలు అడ్డంకి కాకూడదని బాధితురాలు వేడుకుంది. తన పత్రాల్లో లోపాలు లేవని పేర్కొంది. 

తుది తీర్పు.. కీలక సందేశం
రూ.కోట్లలో నష్ట పరిహారం కోరినా విశ్వసనీయ ఆధారాలు సమర్పించలేదని ఆశ్నా రాయ్‌ను ‘సుప్రీం’ తప్పుబట్టింది. ఆమె సమర్పించిన పత్రాల్లోని లోపాలను ఎత్తి చూపింది. ‘‘కేవలం ఊహాగానాలు లేదా వ్యక్తిగత భావాల ఆధారంగా భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించలేం, నష్టం జరిగినట్టు స్పష్టమైన, నమ్మదగిన సాక్ష్యాలు ఉండాలి’’ అని బెంచ్‌ స్పష్టం చేసింది. రూ. 2 కోట్ల పరిహారం ఆర్డర్‌ను రద్దు చే సింది. రూ. 25 లక్షలు తుది పరిహారంగా ప్రకటించింది. 

సేవల్లో లోపం ఉంటే పరిహారం కోరే హక్కు ఉంది..అయితే తగిన, బలమైన సాక్ష్యాలు అవసరమని ఈ తీర్పు స్పష్టం చేసింది. ‘న్యాయం భావోద్వేగాలపై కాదు, ఆధారాలపై నిలబడాలి’ అనే సూత్రాన్ని ఈ కేసు మరోసారి బలంగా తెలియజేసింది. మరోవైపు, ఈ తీర్పు పరిహారం నిర్ణయంలో మార్గదర్శకంగా నిలవనుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అమెరికాకు చెందిన జోనథాన్‌ లీ రిచెస్‌ ప్రపంచంలోనే అత్యధిక వ్యాజ్యాలు దాఖలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇతను  సుమారుగా 2,600 పై చిలుకు కేసులు వేసినట్టు  సమాచారం.  ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై కూడా కేసులు దాఖలు చేశాడు..అతను బిల్‌గేట్స్, జార్జ్‌బుష్‌ వంటి ప్రముఖులే కాదు.. ఈఫిల్‌టవర్, చివరికి  ఫ్లూటో గ్రహం తనపై ప్రభావం చూపిందని ఆ గ్రహంపై కూడా కేసు వేశాడు. ఇలా నిత్యం ఏదో ఒక కేసు దాఖలు చేసి వార్తల్లో నిలవడంతో గిన్నిస్‌ బుక్‌ సైతం ఇతని పేరును రికార్డుల్లోకెక్కించింది.

తన ప్రమేయం లేకుండా పేరు నమోదు చేశారంటూ గిన్నిస్‌ బుక్‌ నిర్వాహకులపై సైతం రిచెస్‌ కేసు వేయడం విశేషం. ఎక్కువ కేసులు సరైన ఆధారాలు లేవని, అసంబద్ధంగా ఉన్నాయని కోర్టులు కొట్టేశాయి. అర్థం,పర్థం లేని అంశాలపై  కేసులు వేసి కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని తీవ్రమైన హెచ్చరికలు సైతం జారీ చేశాయి. ఓ కేసులో ఇతను శిక్షను సైతం అనుభవించాడు. అతడి మానసిక స్థితి సరిగా లేని కారణంగానే ఈ విధంగా ప్రవరిస్తున్నాడని పలువురు విమర్శించారు.  

  • దిలీప్‌ మాదిరెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement