కేరళకు చెందిన ఒక స్టార్టప్ అందరి మనసుల్నీ గెలుచుకుంటోంది. రెంట్ ఏ ట్రీ అనే పేరుతో ఉన్న ఈ సంస్థ.. ఆసక్తిగలవారు ఎవరైనా ఒక మామిడి చెట్టును అద్దెకు తీసుకుని, సాగుతో సంబంధం లేకుండానే ఆ చెట్టుకు కాసే దిగుబడిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. కొచ్చికి చెందిన ఉమేష్ దామోదరన్ ఈ వినూత్న బిజినెస్ని ప్రారంభించారు.
బెంగళూరులో ఒక ఎడ్టెక్ స్టార్టప్ను నడిపే దామోదరన్ ఒకసారి కొచ్చి–బెంగళూరు మధ్య ప్రయాణిస్తున్నపుడు అల్ఫోన్సో మామిడి పండ్లను చూశారు. కొన్నింటిని తన స్నేహితుల కోసం బెంగళూరుకు తీసుకెళ్లగా వారికి ఆ పండ్ల రుచి బాగా నచ్చి, మరోసారి కావాలని కోరారు. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి ఒక పూర్తి చెట్టు పండ్లన్నీ తమకే కావాలని అడిగారు. అపుడే దామోదరన్లో ఈ ‘రెంట్ ఏ ట్రీ’ ఆలోచనకు పునాది పడింది.
ఈ కంపెనీ వెబ్సైట్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన చెట్టును, మామిడి పండ్ల పరిమాణాన్ని బట్టి లీజుకు తీసుకోవచ్చు. చెట్టు సంరక్షణ, సాగు బాధ్యతలన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఈ సంస్థ ఇప్పుడు మహారాష్ట్రలోని రత్నగిరి, తమిళనాడులోని దిండిగల్, కేరళలోని పాలక్కాడ్ ప్రాంతాల్లో సుమారు 250 ఎకరాల అల్ఫోన్సో మామిడి తోటలను నిర్వహిస్తోంది. ఈ స్టార్టప్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
‘బ్రిలియంట్ ఐడియా’ అని కొంతమంది కొనియాడగా, మరికొంతమంది దీనిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాపు సరిగా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కోసారి అనుకోని వర్షాలు పంటను దెబ్బతీస్తాయని.. నష్టం రావొచ్చు అంటూ రాసుకొచ్చారు.


