
కేరళలోని కవస్సేరిలో జరిగిన ఒకముచ్చటైన పెళ్లి నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీపావళి నాడు పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు లావణ్య , విష్ణు వివాహం సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అయితే అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఆ విశేషమేమిటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
మ్యారేజ్ హాలులోనే పంచాయితీ అధికారి ద్వారా వివాహ ధృవీకరణ పత్రాన్ని అందుకోవడమే ఈ స్టోరీలోని ప్రత్యేకత. అదీ డిజిటల్ విధానం ద్వారా. పెళ్లి అయిన మరుక్షణమే ఈ నూతన జంట మ్యారేజ్ రిజిష్ట్రేషన్ సర్టిఫికెట్ అందుకుంది.
కేరళలో వివాహ రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 'K-SMART' అనే డిజిటల్ వేదిక ద్వారా ఇది సాధ్యమైంది. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్కు ఇదొక మైలు రాయి అని పలువురు ప్రశంసిస్తున్నారు. వివాహం జరిగిన వెంటనే, ఈ జంట K-స్మార్ట్ వీడియో KYC వ్యవస్థ ద్వారా వారి వివాహ రిజిస్ట్రేషన్ను పూర్తి చేశారు. అంతేకాదు దీపావళి సెలవు రోజు అయినప్పటికీ కవస్సేరి పంచాయతీ అధికారులు దరఖాస్తును రియల్ టైమ్లో ప్రాసెస్ చేసి ఆమోదించడం, సర్టిఫికెట్ను నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా జంటకు అందించడం విశేషం. పంచాయతీ సభ్యుడు టి వేలాయుధన్ నూతన వధూవరులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. కవస్సేరి పంచాయతీ సిబ్బంది వారి అంకితభావానికి విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.
Kerala sets an example !!
In Kawassery, Kerala, Lavanya and Vishnu got married and registered their marriage instantly through Video KYC.
The Panchayat member even handed over a digitally verified certificate with their photo on the same day.
Respected Panchayati Raj Minister… pic.twitter.com/HGAnoU5cu0— Sreekanth B+ve (@sreekanth324) October 23, 2025
దీంతో చాలా మంది కాబోయే జంటల్లో ఇది ఎంతో సంతోషాన్ని నింపింది. ఎందుకంటే పెళ్లి తరువాత, వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు, ఫోటోలు, సర్టిఫికెట్లు పట్టుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగి కష్టాలేమీ లేకుండానే, ఆన్లైన్ వెరిఫికేషన్ కావడం, క్షణాల్లో సర్టిఫికెట్ రావడం సంతోషమే కదా. కేరళ ఒక ట్రెండ్ సెట్ చేసిందంటూ కొనియాడుతున్నారు ప్రజలు
'K-SMART' అనే డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, వీడియో KYC ద్వారా వివాహ నమోదును పూర్తి చేయవచ్చు . తక్షణమే డిజిటల్లీ సైన్డ్ సర్టిఫికెట్ పొందవచ్చు. వీడియో KYCలో జంటలు, సాక్షులు ఆధార్ ఆధారిత OTP లేదా ఇమెయిల్ ద్వారా తమ గుర్తింపును వీడియో ద్వారా ధృవీకరించుకోవచ్చు. ఇది పూర్తయిన తరువాత డిజిటల్ సంతకం చేసిన వివాహ ధృవీకరణ పత్రాలు జారీ అవుతాయి. వీటిని వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ విధానం ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు (NRIs) ఎంతో సౌకర్యవంతంగా ఉంది, ఎందుకంటే వారు భౌతికంగా హాజరుకావాల్సిన అవసరం లేదు. కె-స్మార్ట్ ప్రారంభించినప్పటి నుండి, కేరళ 1.5 లక్షలకు పైగా వివాహ రిజిస్ట్రేషన్లు నమెదయ్యాయి. దాదాపు 63 వేలు వీడియో KYC ద్వారా పూర్తయ్యాయి.