ఒకప్పుడు మోడల్స్కు, సినీతారలకు మాత్రమే పరిమితమైన గ్లామర్ వేదికలపై ఇప్పుడు మహిళా వ్యాపారవేత్తలు కూడా మెరుస్తున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు ఫ్యాషన్ మెరుపుల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా న్యూయార్క్లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ రెడ్ కార్పెట్పై నిర్వహించిన మెట్గాలా ఫ్యాషన్ ఈవెంట్ మరోసారి గ్లామరస్ బిజినెస్ టైకూన్స్ మెరుపులకు పట్టం కట్టింది. ఒక్కొక్కరు ఒక్కోరకమైన విశేషాల వస్త్రధారణతో ర్యాంప్పై తళుక్కుమన్నారు.
కోట్ల విలువైన వజ్రాభరణాలతో...
ప్రముఖ వ్యాపార సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్– ఇన్ఫ్రాస్ట్రక్చర్స్’ సంస్థకు చెందిన వ్యాపారవేత్త సుధారెడ్డి, న్యూయార్క్ నగరంలో జరిగిన మెట్ గాలా ఈవెంట్లో సెన్సేషన్గా నిలిచారు. భారతీయ వస్త్ర సంప్రదాయాలను ముఖ్యంగా తెలంగాణ వస్త్రశైలుల విశిష్టతను చాటిచెబుతూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులలో ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఈ సంవత్సరపు ‘కాస్ట్యూమ్ ఆర్ట్’ థీమ్కు అనుగుణం గా, ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’ పేరుతో ఆమె వస్త్రధారణను బాలీవుడ్ టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ప్రఖ్యాత సెలబ్రిటీ స్టైలిస్ట్ మారియల్ హేన్ సంయుక్తంగా రూపొందించారు. దీనికితోడు దాదాపు 126 కోట్ల విలువైన ఆభరణాలు సైతం ధరించి ఆమె అందరి దృష్టిని మరింతగా ఆకర్షించారు.
‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ అని పేర్కొనే 550 క్యారెట్ల భారీ ముదురు ఊదా–నీలం రంగు టాంజనైట్, విక్టోరియన్ శైలి వజ్రాల నెక్లెస్ వీటిలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
అదరహో ... అంబానీ...
ఇదే మెట్ గాలాకు ప్రముఖ వ్యాపార కుటుంబం అంబానీ ఫ్యామిలీ నుంచి ఇషా అంబానీ హాజరయ్యారు. ఆమె స్వదేశ్ కళాకారుల సహకారంతో డిజైనర్ గౌరవ్ గు΄్తా రూపొందించిన కస్టమ్ కౌచర్ చీరను ధరించారు. స్వచ్ఛమైన బంగారు దారాలతో నేసిన ఈ చీరపై, లేత బంగారం మట్టి రంగులలో చేతితో చిత్రించిన పిచ్వాయి–ప్రేరిత మోటిఫ్లు ఉన్నాయి. ఈ డిజైన్, చీరను ఒక శిల్పంలాంటి డ్రేప్తో, ఒక కళాత్మక రూపంగా ఆవిష్కరించింది. భారతీయ కళాకారుల చేతుల మీదుగా బంగారంతో నేసిన ఈ చీర పైభాగానికి, వస్త్రంపై 200కు పైగా పాతకాలపు వజ్రాలను చేతితో కుట్టారు. ఇవన్నీ ఆమె తల్లి నీతా అంబానీ వ్యక్తిగత ఆభరణాల సేకరణ కావడం విశేషం.
స్టైల్స్లో ‘రాణింపు...
జైపూర్ రాజ కుటుంబం కూడా మెట్ గాలా లో తనదైన శైలి రాజసం ఒలికించింది. రాజ వంశపు వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకువస్తూ, యువరాణి గౌరవి కుమారి తన అమ్మమ్మ నుంచి ప్రేరణ పొందిన దుస్తులతో మెట్గాలాలో అరంగేట్రం చేశారు. ప్రబల్ గురుంగ్ రూపొందించిన ఈ గౌనులో, మహారాణి గాయత్రీ దేవి అందించిన గులాబీ రంగు షిఫాన్ చీరను పొందుపరిచి, దానిని జైపూర్ నుంచి తెచ్చిన ముత్యాలు, కట్ చేయని వజ్రాలతో అలంకరించారు. ఈ లుక్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
అనన్య సామాన్యం...
బిర్లాల కుటుంబానికి చెందిన భారతీయ మహిళా వ్యాపారవేత్త అనన్య బిర్లా కూడా తనదైన శైలిలో పూర్తి వైవిధ్యాన్ని ప్రదర్శించారు. డిజైనర్ రాబర్ట్ వన్ రూపొందించిన కస్టమైజ్డ్ దుస్తులను ధరించిన ఆమె, మెరిసే నల్లటి లోహంతో చేసిన స్కర్ట్పై బిగుతైన పెప్లమ్ జాకెట్ను ధరించారు. ప్రముఖ భారతీయ కళాకారుడు సుబోధ్ గు΄్తా రూపొందించిన వెండి ఫేస్ మాస్క్తో ఆమె సరికొత్త లుక్ను ప్రదర్శించారు.
అతిరథ మహారథులైన హాలీవుడ్ నటీ నటులు, బాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ పాల్గొనే మెట్గాలాలో మన భారతీయ మహిళా వ్యాపారులు సైతం తమ సత్తా ప్రదర్శించడం... మహిళల్లోని మల్టీ టాస్కింగ్ స్కిల్స్కు చిరు ఉదాహరణ మాత్రమే...
మొత్తం మీద మెట్గాలా వేడుకలో బిజినెస్ ఉమెన్ మెరుపులు అందరినీ అబ్బుర పరచాయి.
– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్


