ఈ దేవతా పూజలో ఇవి వాడరాదు! | Important Things That The Puranas Say About The Practices Of Sanatana Dharma | Sakshi
Sakshi News home page

ఈ దేవతా పూజలో ఇవి వాడరాదు!

May 28 2026 8:08 AM | Updated on May 28 2026 8:08 AM

Important Things That The Puranas Say About The Practices Of Sanatana Dharma

సనాతన ధర్మంలో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సమర్పించే పండ్లు, పువ్వులు, పత్రాల విషయంలో పురాణాలు కొన్ని నియమాలను విధించాయి. ఏ దేవునికి ఏది నిషిద్ధమో తెలియకుండా పూజించడం వల్ల ఆరాధన నిష్ఫలమవుతుందని మనుస్మృతి, వివిధ పురాణ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భక్తులు తప్పక తెలుసుకోవలసిన పూజా నియమాలు, నిషేధాల గురించి...

శ్రీమహావిష్ణువును లక్ష్మీసమేతుడిగా ఆరాధించేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. విష్ణుపూజలో విరిగిన బియ్యాన్ని (అక్షతలను) ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. పూజకు ఎల్లప్పుడూ పూర్తి పరిమాణంలో ఉన్న తాజా అక్షతలను మాత్రమే వాడాలి. అలాగే, విష్ణుమూర్తికి జిల్లేడు, ఉమ్మెత్త  పువ్వులను సమర్పించకూడదు. లయకారుడైన శివుడు అభిషేక ప్రియుడు. అయితే శివపూజలో మొగలిపువ్వును ఉపయోగించడం మహాపాపంగా పరిగణిస్తారు.

పురాణ గాథ..
బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం నడిచినప్పుడు.. బ్రహ్మదేవునికి అనుకూలంగా మొగలిపువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పింది. దీంతో ఆగ్రహించిన పరమశివుడు, తన పూజకు మొగలిపువ్వు పనికిరాకుండా పోతుందని శపించాడు. ఈ వృత్తాంతం శివ పురాణంలో వివరంగా పేర్కొన్నారు.

వినాయకునికి తులసి దళాలు సమర్పించరాదు..
సకల విఘ్నాలను తొలగించే గజాననుడికి 21 రకాల పత్రాలతో పూజ చేయడం ఆనవాయితీ. కానీ, ఆ పత్రీ పూజలో తులసి ఆకులను మాత్రం చేర్చకూడదు. కేవలం వినాయక చతుర్థి రోజున చేసే ఏకవింశతి పత్రీపూజలో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు అమ్మవారికి సమర్పించే పండ్లు తాజాగా, స్వచ్ఛంగా ఉండాలి. నిల్వ ఉన్నవి, పాతబడినవి, పక్షులు లేదా కీటకాలు కొరికినవి, కుళ్ళిపోయిన పండ్లను సమర్పించడం అశుభం.

సూర్యభగవానునికి బిల్వ పత్రాలు సమర్పించరాదు..
ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తికి బిల్వ పత్రాలను (మారేడు దళాలను) సమర్పించడం నిషిద్ధం. మారేడు దళాలు శివపూజకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. సూర్య భగవానుని అనుగ్రహం కోసం ఎర్రటి పువ్వులు (మందార వంటివి), బెల్లం, గోధుమలు, తామ్రపాత్రలో నీటిని అర్ఘ్యంగా సమర్పించడం శ్రేష్ఠమని భవిష్య పురాణం చెబుతోంది. పూజా విధానాలు, సామగ్రికి సంబంధించి మత గ్రంథాలలో స్పష్టమైన నియమాలు ఉన్నప్పటికీ.. ప్రాంతీయ ఆచారాలు, సంప్రదాయాలు, వివిధ వర్గాల నమ్మకాలను బట్టి స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఏది ఏమైనా విశేష పూజలు, వ్రతాలు చేసేటప్పుడు స్థానిక పండితులు లేదా ఇంటి పురోహితుల సలహాలను పాటించడం ఉత్తమం. – పసుపులేటి వెంకటేశ్వరరావు, పాత్రికేయులు

Advertisement
 
Advertisement
Advertisement