Mahasweta Ghosh: ఎడారి చిరుత

First Indian Woman Mahasweta Ghosh Completed World Toughest Race Ultra Marathon In Sahara Desert - Sakshi

న్యూస్‌ మేకర్‌

ప్రపంచంలో అత్యంత కష్టమైన మారథాన్‌ ‘సహారా మారథాన్‌’. ఆరు రోజుల పాటు సహారా ఎడారిలో 250 కిలోమీటర్లు నడవాలి. ఒక్క ఒయాసిస్సు కూడా తగలని  ఈ దారిలో ప్రాణం కూడా పోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన పోటీలో భారతీయ మహిళ మహాశ్వేతా ఘోష్‌ మొదటిసారి పాల్గొని మారథాన్‌ పూర్తి చేసింది. ఆమె పరిచయం.

‘మారథాన్‌ దెస్‌ సేబుల్స్‌’ లేదా ‘మారథాన్‌ ఆఫ్‌ ది శాండ్స్‌’ లేదా ‘సహారా మారథాన్‌’లో పాల్గొనేవారి ధైర్యం ఏమిటో? మామూలుగా ఎండలో నడవడమే కష్టం. అలాంటిది ఎడారి ఎండలో నడవడం సామాన్యమా? మామూలు నేల మీద ఎక్కువసేపు నడవడం కష్టం. ఇక ఎడారి ఇసుకలో ఎక్కువ సేపు నడవడం సాధ్యమా? 44 ఏళ్ల మహాశ్వేతా ఈ అసాధ్యమైన మారథాన్‌ను పూర్తి చేయగలిగింది. అలా చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు స్థాపించింది. ఏప్రిల్‌ చివరి వారంలో మొదలయ్యి మే 1న ఈ మారథాన్‌ పూర్తయ్యింది.

ఎడారిలో సాహసవంతులు
‘మారథాన్‌ ఆఫ్‌ ది శాండ్స్‌’ 1986 నుంచి మొదలయ్యింది. 1984లో పాట్రిక్‌ బ్యూయెర్‌ అనే ఫ్రెంచ్‌ వ్యక్తి మొరాకోలోని సహారా ఎడారిలో 12 రోజుల పాటు ఒక్కడే 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతడు ప్రయాణించిన దారిలో ఒక్క ఒయాసిస్సు కూడా లేదు. ఎడారి తండాలు కూడా కనిపించలేదు. అంటే ఈ దారి అల్‌ట్రా మారథాన్‌కు అనువైనదని భావించి రెండేళ్ల తర్వాత ఈ మారథాన్‌ను మొదలెట్టాడు. అయితే 2009 నాటికిగాని ఇది ఊపందుకోలేదు. ఆ సంవత్సరం వెయ్యి మంది సహారా మారథాన్‌లో పాల్గొన్నారు.

అడుగడుగునా సవాళ్లు
2023లో మారథాన్‌ ఆఫ్‌ ది శాండ్స్‌ ఏప్రిల్‌ చివరి వారంలో మొదలయ్యింది. భారతదేశం నుంచి మహాశ్వేతా ఘోష్‌ మాత్రమే హాజరయ్యింది. అనేక దేశాల నుంచి మొత్తం 1200 మంది పోటీదారులు వచ్చారు. ‘మా అందరికీ 11 కిలోల బరువున్న బ్యాక్‌ ప్యాక్‌ మాత్రమే అనుమతించారు. రోజుకు 12 లీటర్ల నీళ్లు నిర్వాహకులు సప్లై చేశారు. అంతకుమించిన నీరు దొరకవు. ఎవరి ఆహారం వారు తినాలి. మారథాన్‌లో పెద్దగా స్నేహాలు ఏర్పడవు. పోటీ కాబట్టి ఎవరి లక్ష్యంలో వారు నడుస్తుంటారు. ఎడారి దారిలో 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకూ ఉండే ఎండలో నడవడం అంటే మాటలు కాదు. మాకు ప్రతిరోజూ లక్ష్యం ఇస్తారు. అంటే రోజుకు 70 నుంచి 90 కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకోవాలి. ఇచ్చిన సమయంలో నిర్దేశిత దూరానికి చేరుకోలేకపోతే అక్కడితో వారు పోటీ నుంచి డిస్‌క్వాలిఫై అయిపోతారు. నేను ఎలాగైనా ఈ మారథాన్‌ పూర్తి చేయదలిచాను. అందుకే ఏ రోజు కూడా నిర్దేశిత గమ్యాన్ని తప్పలేదు. చాలామంది మధ్యలోనే ఆగిపోయారు’ అని తెలిపింది మహాశ్వేతా.

పోహా, ఓట్స్‌
‘నేను మారథాన్‌ సాగిన ఆరు రోజులు హల్దీరామ్‌ డిహైడ్రేటెడ్‌ దాల్‌ చావల్, రెడీ టు ఈట్‌ పోహా, న్యూట్రిబార్స్, చాక్‌లెట్లు, డ్రై ఓట్స్‌ తిన్నాను. తల మీద సోలార్‌ హ్యాట్, కూలింగ్‌ గ్లాసెస్, స్ట్రోలింగ్‌ స్టిక్స్, భుజాన బ్యాగ్‌తో మన నడక కొనసాగాలి. చివరిరోజు చివరి దశలో పరుగు తీయాలి. ఎండ మన సహనాన్ని పరీక్షిస్తుంది. డీ–హైడ్రేట్‌ కాకుండా చూసుకో వాలి. చాలామంది తల మీద నీళ్లు పోసుకుంటారు. అలా పోసుకోవడం వల్ల వేడి ఇంకా పెరుగుతుంది. కేవలం మెడ, ముఖం తడుపుకుంటూ ముందుకు సాగాలి. గుడారంలో రాత్రిపూట విశ్రాంతిలో భాగ్‌ మిల్కా భాగ్‌లోని స్ఫూర్తిగీతం వినేదాన్ని’ అని చెప్పిందామె.

భ్రాంతుల నుంచి
‘ఎడారిలో భ్రాంతులు ఎక్కువ. వాటి మాయలో పడ్డామంటే చిక్కుల్లో పడతాం. ఈ ఎడారిలో నీకు ఎప్పటికీ నీళ్లు కనిపించవు. కనిపించే నీళ్లను నమ్మకు అని నా మనసుకు చెప్పుకున్నాను. ఏమంటే చాలాసార్లు ఎండమావులు కనిపిస్తాయి. షూస్‌లో ఇసుక దూరకుండా నడవడం పెద్ద విద్య. ఇన్ని కష్టాలు పడ్డా అంతిమంగా యాత్ర ముగిస్తే కలిగే ఆనందం నిజంగా జీవితంలో ఒయాసిస్సులా ఉంటుంది’ అందామె నవ్వుతూ.       

లూజర్స్‌ స్ఫూర్తి
‘మాది పశ్చిమ బెంగాల్‌. నేను కాలేజీలో చదివేప్పుడు సన్నబడటానికి నడకను, జాగింగ్‌ను సాధనంగా చేసుకున్నాను. అదే కొనసాగిస్తున్నాను. 2019లో నెట్‌ఫ్లిక్స్‌లోని లూజర్స్‌ సిరీస్‌ నాకు మారథాన్‌ ఆఫ్‌ శాండ్స్‌ గురించి తెలియజేసింది. అందులోని ఒక ఎపిసోడ్‌లో ఒలింపిక్‌ విజేత మౌరో ప్రాస్పెరీ మారథాన్‌ ఆఫ్‌ శాండ్స్‌ను ఎలా ముగించాడో వివరంగా చూపించారు. నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అయితే ఎడారిలో మారథాన్‌ చాలా కష్టం. అందుకే రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నాకై నేను 75 కిలోమీటర్ల మారథాన్‌ సాధన చేసి ఈ అతికష్టమైన ఎడారి మారథాన్‌కు సిద్ధమయ్యాను’ అని చెప్పింది మహాశ్వేతా ఘోష్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top