ఉండి: మద్యం డబ్బుల కోసం భార్యను హత్య చేసిన భర్త మంగం మురళీని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మల్లికార్జునరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 26న ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడిని శనివారం ఉండి నిమ్మలపేట పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని వెల్లడించారు.
ఉండి: అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం చెరుకువాడ గ్రామానికి చెందిన హర్షితకు 2020లో హైదరాబాద్కు చెందిన కట్రిశెట్టి అఖిలేష్తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. కాగా ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని హర్షిత పోలీసులను ఆశ్రయించింది.
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ వారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు మంగళవారం భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గన్నాబత్తుల శ్రీనివాస్, వడుపు గోపి, గ్రంధి రవితేజ, యర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర మిత్ర బృందం 23 మంది సంయుక్తంగా రూ.3,15,000 విరాళంగా అందజేశారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ దాతలకు శేషవస్త్రం, ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, చైర్మన్ బొండాడ నాగ భూషణం తదితరుల ప్రసాదం, ఫొటో అందజేశారు.
రు. శ్రీవారి ఆలయానికి రూ.2.32 లక్షల విరాళం
కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో ఉన్న స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులుకు భక్తులు విరాళాలు అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ మోకా అరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. దొడ్డనపూడికి చెందిన దివంగత యిర్రింకి సీతారామయ్య–సూర్యనాగరత్నం, దివంగత కొల్లి వెంకటసుబ్బారావు–రామసుందరమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు మూలస్వామి, నాగబాల త్రిపురసుందరి దంపతులు అన్నదాన భవనానికి రూ.1,16,667, మాడ వీధుల విస్తరణ కోసం స్థలం కొనుగోలుకు రూ.1,16,667 అందించినట్లు ఈఓ తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించారు.


