ఏలూరు (ఆర్ఆర్పేట): న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్యానల్ న్యాయవాదులు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వన్టౌన్లోని మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో ప్యానల్ న్యాయవాదులు మాట్లాడుతూ వీర్ పరివార్ సహాయత యోజన పథకాలపై అవగాహన కలిగించారు. మాజీ సైనిక ఉద్యోగులకు ఎదురయ్యే ఆస్తి, పెన్షన్ బకాయిలు మొదలైన అంశాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత సహాయం అందిస్తుందని ఈ అవకాశాన్ని అవసరమైన సైనిక ఉద్యోగులు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు సంగీతరావు, జీవీ భాస్కర్, వెంకటేశ్వరరావు, జీవీ రమణ, జిల్లా సైనిక సంక్షేమ ఆఫీసర్ కొండలరావు, మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


