నిడమర్రు: పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన వంగ వెంకట ప్రభావతి శనివారం విడుదలైన ఏపీఆర్ సెట్లో 42వ ర్యాంక్ సాధించింది. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలో ఒంగోలు డీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఫర్ ఉమెన్స్లో గణితంలో పీహెచ్డీ సీట్ సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారులు అనూరాధ, శేషగిరిరావులు తెలిపారు.
తణుకు అర్బన్: అమరావతి ఇన్క్యూజివ్ క్రికెట్ కప్ 2026 కోసం జిల్లా స్థాయి దివ్యాంగ క్రికెటర్ల ఎంపికలు ఆదివారం తణుకు ఏఎస్సార్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించారు. డీసీఏఏ జనరల్ సెక్రటరీ యడ్లపల్లి సూర్యనారాయణ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ లేళ్ల సుబ్బారాయుడు, ఆర్గనైజర్ పెరుమాళ్ల దిలీప్, డీసీసీఏపీ సభ్యులు కొండా సత్యవరప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా జట్టును ఎంపిక చేశారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల దరఖాస్తుల పరిశీలన అనంతరం నెట్స్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా జట్టును ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
లింగపాలెం: బేర్ సీడ్ కంపెనీ ఏజెంట్ వల్ల సుమారు రూ.50 లక్షలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తొర్లపాటి బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లింగపాలెం మండలం తిమ్మక్కపాలెం గ్రామంలో ఆదివారం నష్టపోయిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ మాట్లాడుతూ కంపెనీ ఏజెంట్ మన్నే రామకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులను నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ముదినేపల్లి(కై కలూరు): జిల్లాలో ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. దేవస్థాన ఆవరణ పుట్టలో భక్తులు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవీ, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కై కలూరు: పెద్దింట్లమ్మా.. నీ భక్తులు కోరిన వరాలివ్వమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మకు మొక్కులు ఆదివారం తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహనపూజలు, విరాళాల ద్వారా రూ.1,00,817 ఆదాయం వచ్చిందని తెలిపారు.
కొయ్యలగూడెం: రాజవరం పంచాయతీ గంగవరం గ్రామ పరిధిలో నిత్యం కొనసాగుతున్న గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని రాజవరం–1, 2 రెవెన్యూ అధికారులు తహసీల్దార్ ఎన్.నాగరాజుకు ఫిర్యాదు చేశారు. రాజవరం సమీపంలోని పెద్ద చెరువు, గంగవరం మెట్ట, ఎర్ర కాలువ ప్రాంతాల్లో జేసీబీ, టిప్పర్ లారీలు పెట్టి తోలకాలు చేస్తున్నారని దీని అడ్డుకుంటే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వేనెంబర్ 483లో భారీ స్థాయిలో గ్రావెల్ మట్టి డంప్ చేసి ఉందని అన్నారు. అక్రమ తోలకాలను నిరోధించడంతోపాటు బాధ్యులైన వారిపై చేసి చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.


