నూజివీడు: వీసాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పించి విదేశాలకు పంపిస్తామని నమ్మించి నకిలీ వీసాలతో మోసం చేస్తున్న నిందితులను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ ఆదివారం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నెహ్రూపేటకు చెందిన రాచప్రోలు ఫణిసుందర్ తన నుంచి నూజివీడుకు చెందిన అట్టారాహ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు కంచల డానియేల్ విక్టర్, హైదరాబాద్కు చెందిన అన్ని ట్రాన్స్ ఓషనిక్ ప్రైవేటు లిమిటెడ్ నిర్వాహకుడు దారా వివేక్ రాజ్ యూకేలో ఉద్యోగం, వీసా ఇప్పిస్తామని నమ్మించి రూ.14.45లక్షలు వసూలు చేసి నకిలీ ఈ వీసా ఇచ్చి మోసం చేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. వీరు ఇక్కడ ఒక్కచోటే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 41 మంది నుంచి దాదాపు రూ.6.50 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. యూకే, కెనడా, లక్సెంబర్గ్ తదితర దేశాలకు పంపుతామని, కావాల్సిన వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారందరిని మోసం చేశారు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వారిపై బీఎన్ఎస్ ప్రకారం 318(4), 336 రెడ్విత్3(5) కింద కేసు నమోదు చేశారు. దారా వివేక్రాజ్ది పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ కాగా కంచల డానియేల్ విక్టర్ది నూజివీడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేధించిన పట్టణ ఎస్సైలు లక్ష్మణ్బాబు, కే.నాగేశ్వరరావు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో సీఐ ఐవీ నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలిప్పించి వీసాలిచ్చి విదేశాలకు పంపుతామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా డీఎస్పీ సూచించారు. ఏదైనా కన్సల్టెన్సీ, ఏజన్సీ ద్వారా విదేశాలకు వెళ్లే ముందు ఆ సంస్థ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వివరాలను ప్రభుత్వ పోర్టల్లో తనిఖీ చేసుకోవాలన్నారు.
పోలీసుల అదుపులో నిందితులు


