కొయ్యలగూడెం: పొగాకు నారుమడులు వేసే ప్రతి రైతు తప్పనిసరిగా టుబాకో బోర్డు వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వేలం నిర్వహణ అధికారి వి.శివకుమార్ సూచించారు. పొగాకు బోర్డు జారీ చేసిన ముఖ్యమైన నిబంధనలను వివరించారు.
గరిష్ట పరిమితి: నారుమడుల రిజిస్ట్రేషన్కు ఒక వ్యక్తిగత రైతుకు గరిష్టంగా 2 హెక్టార్ల పరిమితి మాత్రమే ఉంటుంది. అంతకు మించి అనుమతి లభించదు.
ముందస్తు అనుమతి తప్పనిసరి: రిజిస్టర్డ్ రైతు తన సొంత అవసరాల కోసం నారు పోసుకోవాలనుకున్నా, నేరుగా వేలం నిర్వహణ అధికారికి దరఖాస్తు చేసుకుని ముందస్తు అనుమతి పొందాలి.
అధికారిక విత్తనాలే వాడాలి: రైతులు మార్కెట్లో దొరికే విత్తనాలను వాడకూడదు. ఎన్ఐఆర్సీ, ఏటీసీ–ఐఎల్టీడీ సంస్థలు సిఫార్సు చేసిన, ఎస్ఎల్ఎస్ అధికారిక నారుమడి విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి.
గుర్తింపు లేనివి కొంటే: గుర్తింపు లేని లేదా అనధికార నారుమళ్ల నుంచి నారు కొనుగోలు చేసి తోటలు వేస్తే, ఆ పొగాకును బోర్డు కొనుగోలు చేయదు. అలాంటి తోటలకు ఆథరైజేషన్ కార్డులు జారీ చేయరు.
అనుమతి లేకుండా నారుమడులు వేసినా, కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువగా వేసినా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఉల్లంఘనకు పాల్పడిన రైతుల నారుమడి నిర్వహణ, రిజిస్ట్రేషన్, బేరం లైసెన్సులు తక్షణమే రద్దు చేస్తారు.
డెడ్లైన్: నారుమడులను నవంబర్ 30 నాటికి పూర్తిగా ధ్వంసం చేయాలి. నిర్ణీత గడువు తర్వాత కూడా నారుమడులు అలాగే ఉంచితే బోర్డు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.


