నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ శ్రీప్రకాష్ పాఠశాలలో రెండురోజులుగా కొనసాగుతున్న సీబీఎస్ఈ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఆదివారం ఉదయం మ్యాచ్లను పాఠశాల డైరెక్టర్ విజయ్ప్రకాష్ ప్రారంభించారు. అండర్–14, 17, 19 బాలుర విభాగాల్లో మొత్తం 54 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. క్యార్టర్ ఫైనల్స్ విభాగంలో ప్రతిభ చూపిన ప్రతి విభాగంలోని 4 జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. అండర్–14 విభాగంలో గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం (విశాఖ), డాక్టర్ కేఎల్ ప్రసాద్ స్కూల్ (గుంటూరు), గాడియం స్కూల్ (హైదరాబాద్), సర్ సీఆర్ రెడ్డి స్కూల్ (ఏలూరు) సెమీస్కు చేరుకున్నాయి. అండర్–17 విభాగంలో గాడియం స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్, మౌంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (కర్నూలు), భారతీయ విద్యాభవన్ స్కూళ్లు సెమీస్లో స్థానం పొందాయి. అండర్–19 విభాగంలో శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ (పెద్దాపురం), ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ (కాకినాడ), పల్లవి మోడల్ స్కూల్ (అల్వాల్), బీవీవీ వెంకటేశ్వర స్కూల్(తిరుపతి) సెమీస్కు చేరారు. ఈ పోటీలను టెక్నికల్ అడ్వైజర్ బృందం పర్యవేక్షించగా, రిఫరీలు శ్రీనివాస్, సాయిబాబు, పరమేశ్వరరావు, డి.శ్రీనివాస్ సహకారం అందించారు.
తాడేపల్లిగూడెం: జీతం బకాయి సొమ్ము అడిగితే యూట్యూబ్ చానల్ ప్రతినిధులు వేధింపులకు పాల్పడగా కెమెరామెన్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవ శివప్రసాద్ను ఆదివారం అరెస్టు చేశారు. డీఎస్పీ యు.రవిచంద్ర, ఎస్సై బాదం శ్రీనివాసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఉర్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్యపై అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మీడియా సంస్థ నిర్వాహకులు సురేష్, శివలు తమ కుమారుడిని వేధించారని, అవి తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులలో ఒకరైన దేవ శివప్రసాద్ను ఆదివారం అరెస్టు చేశామన్నారు. సోమవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. మరో నిందితుడు సురేష్ గురించి పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు.


