దెందులూరు: తనపై దౌర్జన్యం చేస్తే దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలహీనపడదని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. బుధవారం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో ఆయన పొలాల వద్ద ఆయిల్పామ్ గెలలు కోస్తున్న నేపథ్యంలో సీఐ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సైలు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు నియోజవర్గంలో నాలుగు మండలాల నుంచి వందలాది సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ రెండేళ్లుగా నా కుటుంబ సభ్యులు పొలాల్లో ఆయిల్పామ్ గెలలు, కోకో పంటలు కోస్తుండగా ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు అడ్డుకుంటున్నారన్నారు. తన నివాసంపై గతంలో రాళ్లు వేసి దాడి చేశారన్నారు. ఈ తరహా కక్షపూరిత రాజకీయాలు తాను ఎన్నడూ చూడలేదన్నారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తన ఇంటిపై, పొలంలో దాడులు చేసిన వారికి తప్పకుండా గుణపాఠం నేర్పుతానని హెచ్చరించారు. రెండు సంవత్సరాలుగా అడ్డుకోవడంతో వందలాది మొక్కలు చనిపోతున్నాయని ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారన్నారు. దాడులు, అక్రమ కేసులతో బెదిరిస్తూ బెంబేలెత్తిస్తున్నారని.. అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నారు. నేరుగా తనతో తలపడాలే తప్ప కుటుంబ సభ్యుల ఆస్తులకు నష్టం కలిగించడం సరికాదన్నారు. వడ్డీల కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, జెడ్పీటీసీ లీలా నవకాంతం, వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర, మండల కొండలరావు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
పొలం వద్ద ఆయిల్పామ్ గెలలు కోయిస్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, పోలీసు బందోబస్తు


