చింతలపూడి (జంగారెడ్డిగూడెం): తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పొగాకు రైతుల ముఖ్య సమావేశానికి బుధవారం జిల్లా నుంచి వైఎస్సార్సీపీ నాయకులతో పాటు రైతులు తరలివెళ్లారు. రైతు సంఘం ప్రతినిధులు పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభంపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ... వేలం కేంద్రాలకు తెచ్చిన బేళ్లలో సగానికి పైగా వ్యాపారులు కొనుగోలు చేయకుండా తిరస్కరించడంతో రవాణా, కూలి ఖర్చులు రైతులకు తీవ్ర భారం అవుతున్నాయని తెలిపారు. 2020లో సంక్షోభం వచ్చినప్పుడు జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ ద్వారా రూ.300 కోట్లు కేటాయించి కొనుగోలు చేయించి ఆదుకున్నారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 32 వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకటరావు, 18వ వేలం కేంద్రం ఉపాధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, రైతు నాయకులు బోడా శ్రీనివాసరెడ్డి, నరహరశెట్టి రాజేంద్ర ప్రసాద్, మధు, సయ్యద్ బాజీ తదితరులు పాల్గొన్నారు.


