పెనుమంట్ర: మండల పరిధిలోని ఓడూరు, భట్లమగుటూరు, జుత్తిగ గ్రామాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు ఎస్సై కె.స్వామి బుధవారం రాత్రి విలేకరులకు తెలిపారు. మంగళవారం రాత్రి భట్టమగుటూరు వద్ద రాష్ట్రీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జుత్తిగ గ్రామానికి చెందిన కొడమంచిలి కామయ్య అలియాస్ గోతియ్య (65) తీవ్రంగా గాయపడ్డారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతుని కుమారుడు సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరించారు. అలాగే ఓడూరు వద్ద కానూరు – లంకలకోడేరు రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన దుండి సంజీవ్ కుమార్ (19) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుని సోదరుడు సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. జుత్తిగకు చెందిన కొండగిరి శంకరరావు (58) ఈ నెల 20న రాత్రి ప్రమాదవశాత్తు జీఅండ్వీ కెనాల్లో పడిపోయారు. బుధవారం ఆయన మృతదేహం లభ్యమైంది. మృతుని కుమారుడు మోహన శివ సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కామయ్య మృతదేహం
సంజీవ కుమార్ (ఫైల్)


