నూజివీడు : ఎల్నినో ప్రమాదం పొంచి ఉన్నందున మామిడి రైతులు యాజమాన్య పద్ధతులను పాటిస్తే తోటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవచ్చని మామిడి పరిశోధనస్థానం ప్రధాన శాస్త్రవేత్త బొర్రా కనకమహాలక్ష్మి పేర్కొన్నారు. ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా స్థానిక మామిడి పరిశోధన స్థానం ఆవరణలో బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు మామిడి తోటలను తొలగించి పామాయిల్ మొక్కలు నాటుతున్నారని, దీనివల్ల దీర్ఘకాలంలో అనేక నష్టాలు ఎదురవుతాయన్నారు. మామిడి తోటలను తీసేయాల్సిన పనిలేదని, సరైన యాజమాన్య పద్ధతులను రైతులు అవలంభిస్తే ఆదాయాన్ని పొందవచ్చన్నారు. మరో శాస్త్రవేత్త కె.ఉమామహేశ్వరి మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు, విస్సన్నపేట ఉద్యాన అధికారులు ఆర్.హేమ, సౌజన్య, కీటక శాస్త్రవేత్త శాలిరాజు తదితరులు పాల్గొన్నారు.


