చింతలపూడి: స్థానిక నగర పంచాయతీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. చింతలపూడి పరిధిలోని పెద్ద చెరువుతో పాటు పరిసర ప్రాంతాల చెరువుల నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్ ఆదేశాలకు తూట్లు
జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పెద్ద చెరువులో బహిరంగంగానే తవ్వకాలు సాగుతున్నా.. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా తరలిస్తున్న మట్టి వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటమే కాకుండా, పర్యావరణ సమతుల్యత కూడా తీవ్రంగా దెబ్బతింటుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టి తరలిపోతోంది. ట్రిప్పర్కు దూరాన్ని బట్టి 5 వేల నుంచి 6 వేల వరకు వసూలు చేస్తురన్నారని స్థానికులు చెబుతున్నారు.
కామవరపుకోట మండలంలో..
కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఇటీవల అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అటు పోలీసులు గానీ, ఇటు రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో సహజ వనరులను కొల్లగొడుతూ, రోడ్లను పాడుచేస్తూ సాగుతున్న ఈ అక్రమ మట్టి దందాను తక్షణమే అరికట్టాలని, ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, తనిఖీలు చేపట్టి అక్రమార్కులపై, వారికి సహకరిస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


