2002లో లేఖర్ల వ్యవస్థ రద్దు
ఏలూరులో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
ఏలూరు (ఆర్ఆర్పేట): భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రజా, ప్రైవే ట్ భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు సరికొత్త నిరసనలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20 (సోమవారం) నుంచి జిల్లావ్యాప్తంగా పెన్డౌన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే లేఖర్ల నిరసనలతో జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నెల ఆరంభంలో (7, 8 తేదీల్లో) లేఖర్ల నిర్వహించిన రెండు రోజుల టోకెన్ పెన్డౌన్ వల్ల రిజిస్ట్రేషన్లు పూర్తిగా స్తంభించాయి. జిల్లాలోని భీమడోలు, జంగారెడ్డిగూడెం, పోలవరం కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. రోజుకు 80 నుంచి 100 రిజిస్ట్రేషన్లు జరిగే ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజుల్లో కలిపి కేవలం 12 మాత్రమే జరిగాయి. మొత్తంగా జిల్లాలోని 12 కార్యాలయాల్లో 7న 65, 8న 147 రెండు రోజుల్లో కేవలం 212 రిజిస్ట్రేషన్లు జరిగి, రూ.70.57 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే కేవలం రెండు రోజుల్లోనే ప్రభుత్వం సుమారు రూ.2 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.
ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తుందా?
ఏలూరు జిల్లాలోనే రోజుకు రూ.కోటి నష్టం వస్తే, రాష్ట్రవ్యాప్తంగా జరిగే నష్టం ఊహాతీతం. ఈ నేపథ్యంలో లేఖర్ల సుదీర్ఘ సమ్మెను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల ఒత్తిళ్లకు లొంగిపోతే, భవిష్యత్తులో ఇతర శాఖల జీఓల అమలుపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఆర్ఎస్కేలపై లేఖర్ల అల్టిమేటం
తాజాగా కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను (ఆర్ఎస్కే) ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ ఉపాధికి గండి పడుతుందని ఆందోళన చెందిన దస్తావేజు లేఖర్ల యూనియన్ పెన్డౌన్కు పిలుపునిచ్చింది. ఈనెల 20 నుంచి 31 వరకు సుదీర్ఘంగా ఈ నిరసన కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.
పాతికేళ్లుగా సాగుతున్న పెత్తనం
లేఖర్ల వ్యవస్థను రద్దు చేసి సుమారు 25 ఏళ్లు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇప్పటికీ లేఖర్ల దే పెత్తనం. ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందు బాటులోకి తెచ్చి, ప్రజలు స్వయంగా దస్తావేజులు తయారు చేసుకునే వెసులుబాటు కల్పించినా ఆశించిన చైతన్యం రాలేదు. ఈ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవడమే దీనికి ప్రధాన కారణం.
కక్షిదారుల అవగాహనా రాహిత్యమే పెట్టుబడిగా రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గతంలో డాక్యుమెంట్ రైటర్ల (దస్తావేజు లేఖర్ల) వ్యవస్థ నడిచింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం ప్రజ లు కచ్చితంగా దస్తావేజు లేఖర్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. వారు ఆస్తి విలువలో 1 నుంచి 2 శాతం వరకు కమీషన్ వీరు వసూలు చే సేవారు. ఉదాహరణకు, రూ.50 లక్షల ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లేఖరులకే దాదాపు రూ.లక్ష వరకు సమర్పించుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో 2002లో చంద్రబాబు ప్రభుత్వం లేఖర్ల వ్యవస్థను రద్దు చేసింది. అప్పటి నుంచే రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టింది.
దస్తావేజు లేఖర్ల పెన్డౌన్
ఆర్ఎస్కేపై ప్రభుత్వానికి అల్టిమేటం
రిజిస్ట్రేషన్లపై ప్రతికూల ప్రభావం
ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా?


