సాంకేతికతకు దూరం.. ఐటీ క్రెడిట్ల తొలగింపు
నూజివీడు : ట్రిపుల్ఐటీల్లో (ఆర్జీయూకేటీ) ఇటీవల కాలంలో విద్యాప్రమాణాలు క్రమంగా క్షీణిస్తున్నా యనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పేద, గ్రామీణ విద్యార్థులకు ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యను అందించాలనే ఆశయంతో ఏర్పాటైన ఈ సంస్థలు, అధికారుల అసమంజస నిర్ణయాల వల్ల తిరోగమనం దిశగా పయనిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
పీయూసీ విధానానికి..
2024 విద్యాసంవత్సరం వరకు ఇంజినీరింగ్ కో ర్సులకు అనుగుణంగా, అంతర్జాతీయ సాంకేతిక మార్పులను బట్టి పీయూసీ సిలబస్ను ప్రత్యేకంగా రూపొందించి బోధించేవారు. అయితే 2025–26 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానానికి స్వస్తి చెప్పి, సాధారణ ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ప్రవేశ పెట్టారు. దీనివల్ల సాధారణ జూనియర్ కాలేజీలకు, ట్రిపుల్ఐటీలకు తేడా లేకుండా పోయిందని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరేళ్ల సమీకృత విద్య విశిష్టతను దెబ్బతీసి, కేవలం ఇంటర్, ఇంజినీరింగ్ల కలయికగా మార్చేసిందనే విమర్శలు ఉన్నాయి.
సెమిస్టర్ విధానానికి స్వస్తి
2008 నుంచి పీయూసీలో విజయవంతంగా అమలువుతున్న సెమిస్టర్ విధానాన్ని 2025–26 విద్యాసంవత్సరం నుంచి రద్దు చేసి, వార్షిక పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏడాది మొత్తం చదివిన సిలబస్ను ఒకేసారి రాయాల్సి రావడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో ఏడాదికి రెండుసార్లు రెమిడియల్ పరీక్షలు రాసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు ఆ అవకాశం ఏడాదికి ఒకేసారికి పరిమితమైంది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు వార్షిక విధానం నుంచి సెమిస్టర్ విధానం వైపు అడుగులు వేస్తుంటే, ట్రిపుల్ఐటీలు మాత్రం వెనక్కి వెళ్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, ట్రిపుల్ఐటీల పూర్వవైభవానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాంకేతిక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఈ సంస్థలో ఐటీ సబ్జెక్టు ప్రాధాన్యతను తగ్గించడం మరో వివాదాస్పద నిర్ణయం.
గతంలో పీయూసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు ఐటీ సబ్జెక్టును తప్పనిసరిగా బోధించేవారు.
ఈ సబ్జెక్టుకు పరీక్షలు నిర్వహించి క్రెడిట్లు కూడా ఇచ్చేవారు.
2025–26 విద్యాసంవత్సరం నుంచి ఈ క్రెడిట్లను తొలగించడంతో, విద్యార్థులు ఐటీ నేర్చుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. రాబోయే రోజుల్లో ఈ సబ్జెక్టునే పూర్తిగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పీయూసీ నుంచే ల్యాప్టాప్లు ఇవ్వడం, ఐటీ బోధించడం వల్లే ప్లేస్మెంట్స్ సాధించడంలో ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఇతర ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే ముందుంటున్నారని సాఫ్ట్వేర్ కంపెనీలు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాయి. అలాంటి కీలక సబ్జెక్టును నిర్వీర్యం చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరేళ్ల సమీకృత సాంకేతిక విద్య కోసం ఏర్పాటు
గతేడాది నుంచి ఇంటర్, ఇంజినీరింగ్ విద్యగా తయారైన బోధన
పీయూసీలో ఇంటర్ పాఠ్య పుస్తకాలతో చదువులు


