టి.నరసాపురం: మండలంలోని బందంచర్ల గ్రామానికి చెందిన పుసునూరి అయ్యప్ప (43) ఆదివారం ఉదయం తన బంధువుల ఇంటి సమీపంలోని షెడ్డులో ఉరివేసుకుని మృతి చెందినట్లు టి.నరసాపురం ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. జయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మద్యానికి బానిసగా మారాడని, శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగిన అనంతరం, ఇంటి సమీపంలోని షెడ్డులో నిద్రించడానికి వెళ్లాడని తెలిపారు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా, అయ్యప్ప ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడని వివరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్లోని దువ్వాడ–గుడివాడ సెక్షన్లలోని పలు స్టేషన్లలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం) వినీత్కుమార్ ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేశారు. దువ్వాడ, కొవ్వూరు, గోదావరి స్టేషన్ల మధ్యలో జరుగుతున్న స్టేషన్ ఆధునికీకరణ పనులు, మౌలిక సదుపాయాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తాడి, అనకాపల్లి, బయ్యవరం, గుల్లిపాడు, గొల్లప్రోలు, రాజమండ్రి, అనకాపల్లి, సామర్లకోట స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించారు. రైళ్ల కార్యకలాపాలు మెరుగుపర్చడం, సెక్షన్ల సామర్థ్యాన్ని పెంచడం, ట్రాఫిక్ సౌకర్యాలను ప్రత్యేకంగా పరిశీలించి అధికారులతో మాట్లాడి సులభతరం చేయడానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం జరుగుతున్న సన్నాహక పనులు పరిశీలించి.. రాజమండ్రి, కొవ్వూరు, గోదావరి స్టేషన్లలో ప్రయాణికుల మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. తనిఖీల్లో విజయవాడ డివిజన్ సీనియర్ డీఓఎం సురేష్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. మా కోరికలు నెరవేర్చవమ్మా అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. వేడి నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదాలు, గదుల అద్దెలు, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.95,047 ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.


