ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా లోక్ అదాలత్ నిర్వహించినట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలి పారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో 38 చెక్బైన్స్ కేసులు పరిష్కారమయ్యాయని, రూ.1,59,85,914లు ఫిర్యాదుదారులకు చెల్లించామన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తమ కేసులను సత్వరంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని న్యాయపరమైన వివాదాల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. గత శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్తో పాటు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయడంలో సహకరించిన న్యాయాధికారులు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
తాడేపల్లిగూడెం: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో మిశ్రమ వ్యవసాయ విధానం ఎంతో అవసరమని ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. శనివారం సింగరాజుపాలెం వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించిన శాస్త్రవేత్తలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను అధిగమించడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నేల సారవంతం, తేమ సంరక్షణపై అవగాహన కల్పించారు. డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు చేయడం వల్ల పెట్టుబడి, శ్రమ తగ్గడమే కాకుండా నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని వారు తెలిపారు. రిజిస్ట్రార్ ఎం. మాధవి, విస్తరణ సంచాలకులు సి.హెచ్. రూత్, పరిశోధన సంచాలకులు ఎస్. సూర్యకుమారి పాల్గొన్నారు.
యలమంచిలి: అబ్బిరాజుపాలెం సూరయ్య రేవు ఫెర్రీ వేలం రూ.10,14,500లకు ఖరారైంది. ఈనెల 10న నిర్వహించిన వేలం రూ.8.10 లక్షలకు ఖరారైన సంగతి తెలిసిందే. అయితే పాట మళ్లీ నిర్వహించాలని కోరుతూ శిరిగినీడి వెంకటేశ్వరరావు రీటెండర్ వేయడంతో స్థానిక సచివాలయంలో ఇన్చార్జి ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్చార్జి గ్రామ కార్యదర్శి కాసాని శ్రీరామలక్ష్మి శనివారం వేలం నిర్వహించారు. శిరిగినీడి శ్రీనివాస్, శిరిగినీడి వెంకటేశ్వరరావు వేలంలో పాల్గొనగా వెంకటేశ్వరరావు అత్యధిక మొత్తానికి పాట పాడారు. దీంతో వెంకటేశ్వరరావుకు ఫెర్రీ వేలం ఖరారు చేసినట్టు శ్రీరామలక్ష్మి ప్రకటించారు.


