కామవరపుకోట : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన కామవరపుకోట శివారు ఉప్పలపాడు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన కొలుకులూరి రమేష్ (30), గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. శుక్రవారం తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా దేవులపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి కామవరపుకోట వచ్చి, కేక్, స్వీట్స్ తీసుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా.. కామవరపుకోట శివారు ఉప్పలపాడు సమీపంలోకి వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రమేష్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. తడికలపూడి ఎస్సై వల్లీ పద్మ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): 108 అంబులెన్స్ వాహనాలపై పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏలూరు జిల్లా 108 కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా సమావేశం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి. శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ మినిమం టైమ్ స్కేల్ కల్పించాలన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు, 108 ఉద్యోగులు పాల్గొన్నారు.


