తణుకు అర్బన్: అనివార్య కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేసిన వారు తిరిగి విద్యను కొనసాగించేందుకు ఓపెన్ స్కూల్ ఒక అద్భుత వరమని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు అన్నారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఎంఈవో బండి ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ నెల 31 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. అనంతరం ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతి, ఫస్ట్ అసిస్టెంట్ రామకృష్ణ, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఆరోగ్య శాఖాధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
నూజివీడు: గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు, రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ‘అమరావతి చాంపియన్ షిప్–26’ పేరుతో క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా డీఎస్డీఓ ఎస్.అజీజ్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7981635592, 9059485538 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. అండర్–17, అండర్–23 విభాగాల్లో బాలికలు, బాలురకు నియోజకవర్గ స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయి. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, హాకీ, చదరంగం, కబడ్డీ, ఖోఖో, వెయిట్లిఫ్టింగ్, వాలీబాల్, యోగా పోటీలు ఉంటాయి. నూజివీడు నియోజకవర్గ స్థాయి పోటీల తేదీలను ఖరారు చేసేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ఎస్ఆర్ఆర్ హైస్కూల్లో సమావేశం నిర్వహించనున్నారు.
కొయ్యలగూడెం (జంగారెడ్డిగూడెం) : మండల పరిధిలోని వెంకటరామానుజపురం గ్రామంలో విద్యుత్ షాక్కు గురై ముప్పిడి వెంకటరెడ్డి (37) అనే కౌలు రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటరెడ్డి ఇటీవల గ్రామంలో కొంత పామాయిల్ తోటను కౌలుకు తీసుకున్న ఆయన, శుక్రవారం తోటలో గెలలు నరికే పనులు చేపట్టాడు. ఈ క్రమంలో పక్క తోట రైతు కొఠారి పవన్ కుమార్ కోరడంతో, అక్కడే ఉన్న కొబ్బరి చెట్టు మట్టలను తొలగించేందుకు వెంకటరెడ్డి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆయన చేతిలోని ఐరన్ గెడ ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ వైర్లకు తాకడంతో విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎన్వీప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


